ప్రియురాలి ఇంట్లో ఉరేసుకున్న బీట్ ఆఫీసర్, వివాహేతర బంధమే కారణమా? అసలేం జరిగింది?
ఆదిలాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీవో) మృతి చెందడం ఆదిలాబాద్ పట్టణంలో కలకలం రేపింది. అతని మరణానికి అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలుండగా.. మరో మహిళతో..
పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన బానోవత్ నెహ్రూ(37)తో తనకు వివాహమైందని జ్యోతి తెలిపింది. వీరికి సాయిశరణ్య, శ్రీహర్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్టిసావర్గాం సమీపంలోని పోలీసు కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. కాగా, తలమడుగు మండలం బరంపూర్లో ఎఫ్బీవోగా నెహ్రూ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు అతని కుటుంబసభ్యలు.
ప్రియురాలి ఇంట్లో ఉరేసుకుని..
కుటుంబసభ్యులు ఆ మహిళతో అక్రమ సంబంధం వదిలివేయాలని మందలించినప్పటికీ నెహ్రూలో మార్పురాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో పాత హౌజింగ్ బోర్డ్ కాలనీలో అద్దెకు ఉంటున్న సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నెహ్రూ. అయితే, తాను ఇంట్లో లేని సమయంలో నెహ్రూ తన ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సదరు మహిళ పోలీసులకు చెప్పింది. తాను బయటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడని తెలిపింది. దీంతో తానే కొడవలితో తాడును కోసేసి కిందికి దించానని పోలీసులకు వివరించింది సదరు మహిళ.
హత్యేనంటూ..
తన కుమారుడు నెహ్రూ మరణ విషయం తమకు తెలియలేదని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అతని మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారని అతని తల్లి శారద ఆరోపించారు. గురువారం రాత్రి 9గంటలకు తన కుమారుడు మృతి చెందితే.. తమకు శుక్రవారం ఉదయం తెలిసిందన్నారు.
అంతా ఆ మహిళే చేసింది..
తాము ఘటనా స్థలానికి వెళ్లకముందే మృతదేహాన్ని అక్కడ్నుంచి ఆస్పత్రికి తరలించారని చెప్పారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళే.. తన కుమారుడు నెహ్రూను హత్య చేసిందని శారద ఆరోపించారు. పోలీసులు కూడా ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ వచ్చ వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని నెహ్రూ కుటుంబసభ్యులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అక్కడికి చేరుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్ రావు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.