నిర్లక్ష్యం: 13మంది కంటిచూపు కోల్పోయే ప్రమాదం, ఇదీ కారణం
హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13మంది కంటిచూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. గత గురువారం పదమూడు మందికి మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
చికిత్సకు ముందు కళ్లలో కాలం చెల్లిన ద్రవం వేశారని, వైద్యుల నిర్లక్ష్యంగా వల్ల ఇప్పటికీ కంటి చూపు రాలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లను శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియా గుర్తించామని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రాజేంద్ర తెలిపారు.
శస్త్ర చికిత్సకు ముందు బ్యాక్టీరియా ఉన్న ద్రవంతో కళ్లు శుభ్రం చేయడం వల్ల రోగులపై ప్రభావం పడిందన్నారు. సెలైన్ బాటిళ్లు వెనక్కి పంపడానికి నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం తరఫున డ్రగ్స్ అధికారులు ఆసుపత్రికి వచ్చి పరిశీలించారన్నారు.
సెలైన్ బాటిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీపై చర్యలు బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. రోగులకు చూపు తెప్పించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకూ మరో వారంపాటు శస్త్ర చికిత్సలు నిలిపివేసినట్లు తెలిపారు.
కాగా, ఈ ఘటన పైన ప్రభుత్వం స్పందించింది. వైద్య ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా కంటి వైద్య నిపుణులు రవీందర్ గౌడ్ను నియమించింది. రోగులు కంటి చూపు కోల్పోయే ప్రమాదానికి గురైన ఘటనలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని ఆయన అన్నారు.
సెలైన్లో బ్యాక్టీరియా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న 13 మంది రోగుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు.