‘‘అక్రమ ఏజెంట్లపై మరింత కఠినం, నెలరోజులు గడువు, ఆ తరువాత కేసులే..’’
హైదరాబాద్: విదేశాలకు పంపిస్తామని చెప్పి అమాయకుల్ని మోసం చేసే అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
ఏజెంట్లకు నెల రోజుల సమయం ఇస్తున్నామని, ప్రతి ఏజెంటు 'ఈ-మైగ్రేట్'లో రిజిస్టర్ చేసుకోవాలని, గడువులోగా నమోదు చేసుకోకపోతే వారందరిని అక్రమ ఏజెంట్లుగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రిజిస్టర్ చేసుకోని అక్రమ ఏజెంట్లపై కేసులు నమోదు చేయడంతోపాటు పదే పదే అక్రమాలకు పాల్పడుతున్న ఏజెంట్లుపై పీడీ చట్టం ప్రయోగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నారై శాఖపై శనివారం మంత్రులు కేటీఆర్, నాయిని సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ ఏజెంట్లపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ నగరంలో విదేశీ భవన్కు ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎన్నారైలు, వలస కార్మికుల కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు.
గల్ఫ్కు మహిళల అక్రమ రవాణాపైన మరింత కఠినంగా వ్యవహారించాలని పోలీసు శాఖను అదేశించారు. ఈ విషయంలో మైనార్టీ సంక్షేమ, కార్మిక, ఎన్నారై, పోలీసు శాఖలు ఉమ్మడి బృందాల ఏర్పాటు చేయాలని మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి ఆదేశించారు.