దేశంలోనే తొలిసారి .. తెలంగాణా మున్సిపోల్స్ లో దొంగ ఓట్లకు చెక్ పెట్టే ఫేస్ రికగ్నిషన్ యాప్
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . అయితే దేశంలోనే తొలిసారిగా దొంగ ఓట్లకు చెక్ పెట్టటానికి తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేస్తుంది ఎలెక్షన్ కమీషన్ . తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా.. 'ఫేస్ రికగ్నిషన్ యాప్'ని ప్రవేశ పెట్టింది ఎలక్షన్ కమీషన్ .
ప్రారంభమైన తెలంగాణా మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
కట్టుదిట్టమైన ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
ఓటర్ల ప్రామాణికతను ధృవీకరించడం ద్వారా ఎన్నికలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలనే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (టిఎస్ఇసి) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో పైలట్ ప్రాతిపదికన ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించాలని నిర్ణయించింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని చేర్చడం పోలింగ్ సమయంలో దొంగ ఓట్లతో మోసం చేసేవారిని పట్టుకోటానికి ఎన్నికల నిర్వహణ సంస్థకు సహాయపడుతుందని టిఎస్ఇసి ఒక ప్రకటనలో తెలిపింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
భారత దేశంలోనే ఏ ఎన్నికల్లోనూ ప్రయోగించని ఈ విధానాన్ని తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే 10 ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. ఇక ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఫలితాలు ఎలా ఉంటాయో ప్రయోగం చెయ్యబోతున్నారు ఎన్నికల అధికారులు . ఈ యాప్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మున్సిపలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా ఉపయోగిస్తున్నారు. ఇక యాప్ ద్వారా ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే ఇట్టే పసిగట్టవచ్చు అని అధికారులు భావిస్తున్నారు .
ఫేక్ ఓటర్లకు చెక్ పెట్టే సరికొత్త ప్రయోగం
కృతిమ మేథస్సు , మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటాల మేళవింపుగా ఫేస్ రికగ్నిషన్ యాప్ సాంకేతికత పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు .ఇక ఈ యాప్ లో ఓటు వేసే వ్యక్తి పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్తో ఫొటో తీస్తారు. ఈ యాప్ లో అప్పటికే మొబైల్ ఫోన్కి లింక్ ఉన్న ఎలక్షన్ కమిషన్ డేటాలో ఓటర్ మొఖాన్ని చెక్ చేస్తారు. ఆ రెండు ముఖాలు సేమ్ అయితేనే ఓటు వేయడానికి అర్హులవుతారు.లేదంటే వారు ఫేక్ ఓటర్లని ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించింది అని అర్ధం .
పైలట్ ప్రాజెక్ట్ గా 10 పోలింగ్ కేంద్రాల్లో వినియోగం
ఈ మధ్య దొంగ ఓట్లు ఎక్కువ అవడంతో వాటికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఈ విధమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక యాప్ లో ఓటు వేసిన వ్యక్తుల ఫొటోలు భద్రపరుస్తారు. అది ఫేక్ ఓటర్లను గుర్తిస్తుంది . అయితే ఇది పైలెట్ ప్రాజెక్టు కాబట్టి పూర్తిగా ఓటింగ్ ముగిసిన తర్వాత ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ యాప్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవటం కోసమే ఈ యాప్ ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఏ ఇతర విషయాలకు వాటిని అనుసంధానించబోమని రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.