ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్బుక్ కామెంట్
హైదరాబాద్: ఫేస్బుక్లో పోస్టు చేసిన ఫొటో మీద చేసిన కామెంట్స్ స్నేహితుల మధ్య ఘర్షణకు దారితీయడమేగాక, ఓ యువకుడి ప్రాణాలక మీదకు తెచ్చింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్ ప్రాంతానికి చెందిన షేక్ సయీద్(20), ఖాలెద్ బాక్రా(19)కు శాలిబండ ఖాజిపురాకు చెందిన సోదరులు ఇర్ఫాన్(18), ముఖీద్(20) స్నేహితులు. ఫేస్బుక్లో పెట్టిన ఓ ఫొటోకు రాసిన వ్యాఖ్యానం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది.
వివాదం పరిష్కరించుకుందామని షేక్ సయీద్, ఖాలెద్ బాక్రా స్నేహితులిద్దరినీ చాంద్రాయణగుట్ట ఘాజి మిల్లత్ కాలనీకి రమ్మన్నారు. మంగళవారం రాత్రి కలిసిన వీరి మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన షేక్ సయీద్, ఖాలెద్ బాక్రా కత్తులతో ఇర్ఫాన్ సోదరులపై దాడి చేశారు.
ఈ ఘటనలో ఇర్ఫాన్ తలకు తీవ్రగాయమైంది. ముఖీద్కు నడుం భాగంలో కత్తిపోట్లు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వృద్ధ దంపతులపై పోలీసుల దాడి
నగరంలోని పాతబస్తీలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఇద్దరు పోలీసులు వీరంగం సృష్టించారు. నిందితుడికి బదులు మరో యువకుడిపై పోలీసులు దాడి చేశారు. అడ్డు వచ్చిన యువకుడి తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అరుపులు కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులను పట్టుకున్నారు. కానిస్టేబుళ్లను మాదన్నపేట పోలీస్స్టేషన్లో స్థానికులు అప్పగించారు. పోలీసుల దాడిలో గాయపడిన వృద్ధులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.