ఎమ్మెల్యే రాజా సింగ్కు ఫేస్బుక్ షాక్...అకౌంట్ బ్యాన్.. రాజాసింగ్ వివరణ ఏంటి..?
హైదరాబాదు: విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై, విషప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్. ఇప్పటికే ఒక వర్గంకు ఫేస్బుక్ కొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వస్తుండటంపై స్పష్టత ఇచ్చిన ఫేస్బుక్ సంస్థ... ఎవరు ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అలాంటి ఖాతాలను నిషేధిస్తామంటూ పేర్కొంది. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాను బ్యాన్ చేసింది ఫేస్బుక్.
ఎమ్మెల్యే రాజాసింగ్ అకౌంట్ బ్యాన్
బీజేపీకి ఫేస్బుక్ మద్దతుగా ఉంటోందంటూ ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాపై నిషేధం విధించింది. రాజాసింగ్ విద్వేషాలను రెచ్చగొట్టే కామెంట్లను పోస్టు చేశారని గుర్తించిన ఫేస్బుక్ అతని అకౌంట్ను బ్యాన్ చేసింది. హింస, విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండే పోస్టులు పెట్టరాదన్న తమ విధానాలకు వ్యతిరేకంగా రాజాసింగ్ పోస్టులు పెట్టినందున ఆయన ఖాతాను తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ ప్రకటన ద్వారా ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా ఉంచామని అలాంటి వారు దొరికితే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.
గతంలో విద్వేషపూరితమైన పోస్టులంటూ...
ఇప్పటికే రాజాసింగ్ చేసిన పలు విద్వేషపూరితమైన పోస్టులను తొలగించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. భారత్లోని ఒక రాజకీయ పార్టీకి ఫేస్బుక్ సంస్థ మద్దతుగా నిలుస్తోందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసిన క్రమంలో రాజాసింగ్ పోస్టులను గతంలో ఫేస్బుక్ తొలగించింది. అయితే ఈ మధ్యకాలంలో ఫేస్బుక్పై విమర్శలు ఎక్కువ అవుతుండటంతో తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పోస్టులపై అభ్యంతరం తెలుపుతూ ఫేస్బుక్ అతని ఖాతాను బ్యాన్ చేసింది. ఇదిలా ఉంటే ఫేస్బుక్ కంటెంట్ పాలసీలను తరచూ ఉల్లంఘిస్తున్నవారిలో రాజాసింగ్ ప్రథమ వరుసలో నిలిచారు. అయితే 2018లో తన ఫేస్బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి బ్లాక్ చేసినట్లు ఆయన తెలిపారు.
రాజాసింగ్ వివరణ
తాజా ఘటనపై రాజాసింగ్ స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ను ఫేస్బుక్ బ్యాన్ చేసిందని తనకు ఈ రోజే తెలిసిందన్నారు. అయితే తన పేరుతో చాలా మంది అకౌంట్లు సృష్టించుకున్నారని చెప్పారు. చాలామంది తన అభిమానులు, కార్యకర్తలు తన పేరుపై అకౌంట్లు సృష్టించుకున్నారని చెప్పారు. వాటన్నిటినీ ఫేస్బుక్ అధికారులు నిషేధించినట్లు తనకు తెలిసిందని దీనిపై వారికి ధన్యవాదాలు చెబుతున్నట్లు చెప్పారు. 2018లో తన అధికారిక ఫేస్బుక్ పేజ్ను నిషేధించారని వెంటనే దాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. ఇందుకోసం అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తానని వెల్లడించారు.
ఫేస్బుక్పై విమర్శలు
ఒక పార్టీకి కొమ్ముకాస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ ముందు ఫేస్బుక్ ప్రతినిధి అజిత్ మోహన్ హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఆయన్ను ప్యానెల్ ప్రశ్నించింది. అయితే ఏ పార్టీకి ఫేస్బుక్ సంస్థ మద్దతుగా పనిచేయలేదని అజిత్ మోహన్ ప్యానెల్ ముందు వివరించారు. అంతకుముందు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్కు లేఖ రాశారు. ప్రధానిపై ఇతర సీనియర్ కేబినెట్ మంత్రులను కించపరుస్తూ కొందరు పెడుతున్న పోస్టింగులపై చర్యలు తీసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ లేఖలో కోరారు. అంతేకాదు సంస్థలో కొందరు ఉద్యోగులు కొంతమంది రాజకీయనాయకుల కోసం పనిచేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.