ఆ ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్: క్లారిటీ ఇచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి
హైదరాబాద్/మెదక్: తెలంగాణలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి కూడా కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పోస్టును మెదక్ జిల్లా రాజుపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసినట్లు గుర్తించారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, కోఠిలో గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో గోకుల్ చాట్లో పనిచేసే సిబ్బంది, అక్కడ్ తినుబండారాలను ఆరగించిన కస్టమర్లకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో గోకుల్ చాట్ను మూసివేసిన అధికారులు.. అందులో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. ఇక గత రెండ్రోజులుగా గోకుల్ చాట్ వచ్చిన కస్టమర్ల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 5193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2240 యాక్టివ్ కేసులున్నాయి. 2766 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 187 మంది ప్రాణాలు కోల్పోయారు.