చంపేస్తానని పుట్ట మధు బెదిరించాడు, మధుకర్ది ముమ్మాటికి హత్యే: నిజ నిర్దారణ కమిటీ
శిరీషతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యే పుట్ట మధు మధుకర్ ను హెచ్చరించినట్లుగా కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు.
మంథని/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మంథని మధుకర్ అనుమానస్పద మృతిపై తాజాగా నిజ నిర్దారణ కమిటీ తమ రిపోర్టును మీడియా ముందు పెట్టింది. ఆత్మహత్య అని వస్తున్న ఆరోపణలను తప్పుపడుతూ మధుకర్ది కచ్చితంగా కుల కోణంలో జరిగిన హత్యేనని కమిటీ స్పష్టం చేసింది.
మంగళవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిజ నిర్దారణ కమిటీ సభ్యులు రిపోర్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించిన తర్వాతే నిజ నిర్దారణ చేసినట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. మధుకర్-శిరీషల మధ్య ప్రేమ వ్యవహారం.. మధుకర్ హత్యకు దారితీసిన పరిణామాల గురించి రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ట్రాక్టర్ డ్రైవర్గా:
ఖానాపూర్కు చెందిన మంథని లక్ష్మమ్మ-ఎల్లయ్య దంపతుల ఐదో కొడుకు మధుకర్. ఐదో తరగతి దాకా చదవుకున్న మధుకర్.. చదువు మానేసి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఖానాపూర్కు 16కి.మీ దూరంలో ఉన్న వెంకటాపూర్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
శిరీషతో ప్రేమ వ్యవహారం:
వెంకటాపురం గ్రామానికి చెందిన రేగటి సుధాకర్-రాజక్కల కుమార్తె శిరీషకు మధుకర్కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మధుకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, శిరీష మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. శిరీష స్థానికంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
పుట్ట మధుకు దగ్గరి బంధువే!:
నిజ నిర్దారణ కమిటీ కథనం ప్రకారం.. మధుకర్ ప్రేమించిన అమ్మాయి రేగటి శిరీష మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకు దగ్గరి బంధువు. ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. శిరీష-మధుకర్ ల ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడని నివేదిక చెబుతోంది.
చంపేస్తానని బెదిరించిన పుట్ట మధు:
శిరీషతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యే పుట్ట మధు మధుకర్ను హెచ్చరించినట్లుగా కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరోసారి మధుకర్ను హెచ్చరించిన పుట్ట మధు.. తొందరలోనే నిన్ను చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన మధుకర్ అనారోగ్యానికి గురయ్యాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారిలోను భయాందోళన మొదలైంది.
తల్లిదండ్రులు వాదన:
మార్చి 13వ తేదీ ఉదయం వెంకటాపూర్ సర్పంచ్ సేవంతుల ఓదెలు కొడుకు అఖిల్ మధుకర్ను ఇంటినుంచి బైక్ పై బయటకి తీసుకెళ్లాడు. ఇక ఆ తర్వాత మధుకర్ మళ్లీ కనిపించలేదు. అదే రోజు సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులంతా అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బంధువులను కూడా ఆరా తీశారు. కానీ ఎక్కడా మధుకర్ ఆచూకీ దొరకలేదు. సర్పంచ్ సైతం శిరీషకు దగ్గరి బంధువే కావడం గమనార్హం.
11వ తేదీ ఉదయం వరకు:
మార్చి 11వ తేదీ ఉదయం వరకు మధుకర్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంకటాపూర్ లోని శిరీష ఇంటి వద్దకు వెళ్లగా.. ఇంటి వద్ద ఎవరు లేనట్లు గమనించారు. ఆ తర్వాత సుమారు 11.30గం. సమయంలో శిరీష వద్ద నుంచి మధుకర్ కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ఖానాపూర్ గ్రామంలోనే మధుకర్ మృతదేహాన్ని వెతకాలని చెప్పింది.
పొదల్లో దొరికిన మృతదేహాం:
శిరీష ఫోన్ కాల్ తర్వాత మధుకర్ కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులతో కలిసి గ్రామం మొత్తం వెతికారు. చివరకు మంథని వెళ్లే మార్గంలో చెట్ల పొదల కింద మధుకర్ శవమై కనిపించాడు. సాయంత్రం 6గం. సమయంలో అతని మృతదేహం లభ్యమైంది.
రీపోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూపు:
మధుకర్ అనుమానస్పద మృతి కేసులో రీపోస్టుమార్టం నివేదిక కీలకంగా మారడంతో.. అందులో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయోనన్న ఉత్కంఠ ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. రీపోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కొన్ని అవయవాలను ల్యాబ్ టెస్టులకు పంపించారు. నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించారు.