2000నోట్లు జిరాక్స్ తీసి మోసం: ఇద్దరి అరెస్ట్, కస్టడీకి పరారైన ఖైదీ
జనగామ: కొత్తగా వచ్చిన రూ.2000 నోటును కలర్ జిరాక్స్ తీసి మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కురవి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ రక్షణ నిలయాధికారి కృష్ణారెడ్డి కథనం ప్రకారం.. నారాయణపురం తండాకు చెందిన తేజావత్ ప్రమోద్ ఏడాదిగా కురవిలో జిరాక్స్ కేంద్రం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల కొత్తగా వచ్చిన రూ.2000 నోటును మార్పిడి చేయడం కోసం తన జిరాక్స్ కేంద్రంలో ఆదివారం కలర్ జిరాక్స్ తీశాడు. వాటిని అదే రోజు తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన ప్రదీప్కు ఇచ్చి శ్రీవీరభద్రస్వామి పెట్రోల్ బంకులోకి మార్పిడి కోసం పంపాడు. ద్విచక్ర వాహనంలో పోయగానే మిగిలిన చిల్లర డబ్బులు త్వరగా ఇవ్వాలని అడగటంతో పెట్రోల్ బంకు సిబ్బందికి అనుమానం వచ్చింది.
నోటును పూర్తిగా పరిశీలించి కలర్ జిరాక్స్గా గుర్తించారు. వెంటనే బంక్ మేనేజర్ రహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిగా విచారణ చేయగా నోట్ల మార్పిడి కోసం కలర్ జిరాక్స్ తీసినట్లుగా ఇద్దరు అంగీకరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సీఐ వెంట కురవి, మహబూబాబాద్ రూరల్ రక్షణ నిలయాధికారులు అశోక్, జితేంధర్, సిబ్బంది ప్రకాశ్, తిరుపతి ఉన్నారు.
జ్యుడిషియల్ కస్టడీకి తప్పించుకున్న ఖైదీ
వరంగల్ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న ఇద్దరు ఖైదీల్లో ఒకరిని పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీ తరలించినట్లు మట్టెవాడ సీఐ శివరామయ్య తెలిపారు. నవంబర్ 12వ తేదీన కారాగారం నుంచి సైనిక్సింగ్, రాజేష్యాదవ్లు గోడదూకి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అదేరోజు మట్టెవాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
మరుసటి రోజు సైనిక్సింగ్ ఆంధ్రప్రదేశ్లోని గాజువాకలో పట్టుబడ్డాడు. ఏసీపీ ఈశ్వర్రావు, సీఐ శివరామయ్య బృందం గాజువాక వెళ్లి సైనిక్సింగ్ను వరంగల్కు తరలించారు. మంగళవారం ఖైదీకి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మరో ఖైదీ రాజేశ్యాదవ్ కోసం మరో ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు తెలిపారు.
సైనిక్సింగ్ను మట్టెవాడ పోలీస్స్టేషన్కు తరలించే క్రమంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను లోపలికి రానివ్వలేదు. స్టేషన్ ప్రధాన ద్వారం కూడా మూసివేశారు. కమిషనర్ సుధీర్బాబు, ఏసీపీ సురేంద్రనాథ్, ఇతర పోలీస్ అధికారులు ఎలా పారిపోయారు, ఎవరెవరు సహకరించారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.