శాంతి పూజలంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న బురిడీ బాబా అరెస్ట్
హైదరాబాద్: గంగమ్మ తల్లిని అంటూ భక్తులకు మాయమాటలు చెబుతూ డబ్బులు కాజేస్తున్న మరో నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ గ్రామంలోని పెద్ద చెరువు సమీపంలో గంగమ్మ తల్లి ఆలయం ఉంది.
గ్రామానికి చెందిన లచ్చయ్య(నకిలీ బాబా)గత కొన్నేళ్లుగా గంగమ్మ తల్లి తన శరీరం పైకి వస్తుందని, భక్తులకు ఎలాంటి సమస్యలు వచ్చిన తీరుస్తుంటాడనే నమ్మకం ప్రజల్లో కలిగించాడు. దీంతో ఇతగాడి వద్దకు జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున వస్తుంటారు.
నాలుగు వారాల క్రితం టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య, మంజుల అనే దంపతులు ఇతగాడి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నకిలీ బాబా మంజులకు త్వరలో ప్రాణహాణి ఉందని, ఆమెపై నుంచి దోషం పోవాలంటే శాంతి పూజలు అవసరమని చెప్పాడు.
దీంతో బాధిత భక్తురాలు వెంటనే శాంతి పూజ చేయాలని కోరడంతో, బాబా రూ. 25 వేలు అవుతుందని చెప్పాడు. దీనికి మంజుల అంగీకరించడంతో ఆమె ఇంటికి వెళ్లి పూజా కార్యక్రమం జరిపించారు. అనంతరం బాబాకు రూ. 25వేల నగదు అప్పగించారు.
ఆ తర్వాత గంగమ్మ తల్లి మంజుల చేసిన శాంతిపూజను ఒప్పుకోవడం లేదంటూ మరో రెండు మేకపొటేలు కావాలని కోరాడు. దీంతో ఆమె రూ.11,500 వేలకు రెండు మేకలను కొనుగోలు చేసి నకిలీ బాబాకు ఇచ్చారు. దీని తర్వాత మరోసారి రూ. 30 వేలు, 5తులాల వెండి, అర్ధ తులం బంగారం అమ్మవారికి సమర్పించాలని కోరాడు.
ఇలా ప్రతి ఆదివారం తన వద్దకు వచ్చే భక్తులకు ఏదో ఒకటి చెప్పి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బు గుంజడం మొదలుపెట్టాడు. ఇది ఆనోటా ఈనోటా పడి చివరకు పోలీసులకు తెలిసింది. దీంతో ఆదివారం దుర్గయ్య, మంజుల దంపతులు అర్ధ తులం బంగారం, 5 తులాల వెండితో పాటు 11వేల రూపాయల నగదుతో నకిలీ బాబా ఆలయానికి వెళ్లారు.
ప్రతి ఆదివారం మాదిరిగానే లచ్చయ్య(నకిలీ బాబా) ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని, భక్తులు పెట్టిన బట్టలు, చీరలు, ఒడిబియ్యాలను బాబుకు సమర్పిస్తుండగా రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాబాతో పాటు అక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరి నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.