పెద్ద కథే ఉంది..!: హెర్బల్ బాబా నుంచి బురిడీ శివానందబాబా వరకు
హైదరాబాద్: హైదరాబాద్లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని, రియల్టర్ మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసి ఒక కోటి 30 లక్షల రూపాయలు కాజేసిన కేసులో అరెస్ట్ చేసిన శివానందబాబా వెనుక చాలా పెద్ద కథే ఉంది. బాబా అవతారం ఎత్తకముందు అతడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడంట.
చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా ఒండగంపల్లి గ్రామానికి చెందిన శివ బాబా అవతారం ఎత్తకముందు హెర్బల్ మందులు అమ్మి జీవనం సాగించాడంట. అసలు అతడు బాబాగా మారడం వెనుకు చాలా కారణాలే ఉన్నాయని తెలిసింది. శివానందబాబా తండ్రికి ఇద్దరు భార్యలు.
మొదటి బార్య కొడుకు ఈ నకిలీ బాబా. తండ్రి నిర్లక్ష్యం చేయడంతో చదువు అబ్బలేదు. అతి కష్టం మీద పదో తరగతి పాసయ్యాడు. ఆ తర్వాత ఐటీఐ చేద్దామని అనుకున్నాడు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో దానిని మధ్యలోనే వదిలేశాడు. వ్యాపారం చేసుకుంటానని తండ్రిని ఐదు లక్షలు అడిగాడు.
అయితే అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో ఇంటి నుంచి వచ్చేసి తిరుపతిలోని ఓ ఆశ్రమంలో చేరాడు. అక్కడ పూజారుల ద్వారా మంత్రోచ్ఛరణలను నేర్చుకున్నాడు. ఆ తర్వాత తిరువనంతపురం, చెన్నైకి వెళ్లి కొద్ది రోజులున్నాడు. అనంతరం కేరళకు వెళ్లి ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు.
ఆ తర్వాత బెంగుళూరులో హెర్బల్ మందుల గురించి తెలుసుకుని... చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హర్స్లీహిల్స్లో వాటిని అమ్ముతూ జీవనం సాగించేవాడు. అయితే.. ఆ మందులు కొనేవారు అతడిని బాబా అని పిలిచేవారు. దీనిని ఆసరా చేసుకుని పూజల పేరిట మోసాలకు తెర తీశాడు.
రైస్పుల్లింగ్, పురాతన నాణేల పేరుతో కొద్దిరోజులు మోసం చేసిన ఈ శివానంద బాబా.. ఆ తర్వాత డబ్బును రెట్టింపు చేసే బాబాగా అవతారం ఎత్తాడు. మరి ఆ మహిమలు తనకున్నాయంటూ జనానికి తెలియాలి కదా..! అందుకే బడా బాబుల వద్ద ప్రచారం చేసేందుకు కొంత మంది వ్యక్తులను నియమించుకున్నాడు.
పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సంబంధాలు ఉండేవారితో పరిచయం పెంచుకున్నాడు. ఆ దారిలోనే మధుసూదన్రెడ్డికి శివస్వామిని జనార్దన్రెడ్డి అనే వ్యక్తి పరిచయం చేశాడు. జనార్ధన్ రెడ్డి ఇద్దరి వద్దా రూ.20 వేల చొప్పున వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.
అంతేకాదు దక్షిణాదిలోని అనేక ప్రాంతాల్లో శివానందబాబాకు ఇలాంటి మధ్యవర్తులు చాలా మందే ఉన్నారు.ఈ మధ్యవర్తుల ద్వారానే బెంగళూర్లోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు, కర్ణాటక కొలైగల్ తాలూకా చామరాజ్ నగర్లో శనేశ్వర్ బాబాతో కలిసి రూ.10 లక్షలకు టోపీ పెట్టాడని పోలీసులు వెల్లడించారు.
కాగా, కాగా, మధుసూదన్రెడ్డి నుంచి శివానందబాబా రూ.1.33 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పోలీసులు రూ.1.22 కోట్లనే స్వాధీనం చేసుకున్నారు. మిగతా పది లక్షలు ఏమయ్యాయనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన శివానందబాబాను శనివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.
తొలుత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతనిని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు శివానందబాబాను కస్టడీకి కోరనున్నారు.
దీనికి సంబంధించి సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు.