చైనా టు వరంగల్ వయా ముదిగొండ: ఇది కల్తీకారం కథ
వరంగల్ కేంద్రంగా గత కొన్నేళ్లుగా సాగుతున్న కల్తీ కారం పొడి దందా బట్టబయలైంది.
జనగామ: వరంగల్ కేంద్రంగా గత కొన్నేళ్లుగా సాగుతున్న కల్తీ కారం పొడి దందా బట్టబయలైంది. చైనాతో పాటు ఇతర దేశాల్లో మిర్చి నుంచి ఆయిల్ తీసిన అనంతరం మిగిలిన పిప్పిని ఖమ్మం జిల్లా ముదిగొండకు తీసుకువచ్చి కారం పొడిలో మిక్స్ చేసి విక్రయిస్తున్న ముఠాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
భారీ మొత్తంలో ఈ పొడి బస్తాలను ఏనుమాముల పరిసరాల్లో ఉన్న కోల్డ్స్టోరేజీల్లో స్టాక్ పెట్టారని అందిన సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వారిపై ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో 11 మందిపై కేసులు నమోదు చేశారు.
అక్రమ దందా ఇలా...
నాణ్యతలేని మిర్చితో కారం పొడి యారు చేసి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు నవంబర్ 26న ఏనుమాముల మార్క్ట్ సమీపంలోని కోల్డ్స్టోరేజీలపై మూడు రోజులపాటు వరుసగా దాడులు కొనసాగాయి.
అనుమతి లేకుండానే ఖమ్మం జిల్లా నుంచి భారీ మొత్తంలో నాణ్యతలేని మిర్చి బస్తాలు, కారంపొడి బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మిర్చి బస్తాల లోడ్తో ఉన్న లారీలను సైతం అధికారుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులోని సరుకును స్వాధీనం చేసుకున్న అధికారులు.. నాణ్యతలేని మిర్చిని, కారం పొడిని నాణ్యత పరీక్షల కోసం లాబోరేటరీకి పంపించారు.
ఈపొడిలో మిర్చి నుంచి ఆయిల్ తీసిన అనంతరం మిగిలని పిప్పితో పాటు కొబ్బరి పీచుకు చెందిన పొడిని ఉపయోగించి కల్తీ పౌడర్ తయారు చేసి స్థానిక వ్యాపారుల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం.