ఉద్యోగం పేరుతో టెక్కీ హోటల్ గదికి యువతిని పంపి బ్లాక్మెయిల్
హైదరాబాద్: హోటల్ గదిలో బస చేసిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ వద్దకు మహిళను పంపించి అతనిని బ్లాక్ మెయిల్ చేసి రూ.5.50 లక్షలు తీసుకున్న సంఘటన హైదరాబాదులో జరిగింది. తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని, మీడియా ప్రతినిధులమని చెప్పి ఆ మొత్తాన్ని కాజేశారు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేసే రవికుమార్ గత నెల 29న తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పరామర్శించేందుకు ఎక్కువ మంది రాగా వారి కోసం అమీర్ పోటలోని హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు.
హోటల్కు వచ్చిన వినోద్ అనే యువకుడు రవికుమార్ను పరిచయం చేసుకున్నాడు. తనకు తెలిసిన అనూష అనే యువతికి ఉద్యోగం కావాలని రవికుమార్కు చెప్పాడు. దీంతో, సదరు టెక్కీ చూస్తానని చెప్పారు. టెక్కీని పరిచయం చేసుకున్న వినోద్.. తన స్నేహితుడు భానుప్రకాశ్కు ఈ విషయం చెప్పాడు.
అనుషను రవి కుమార్ వద్దకు పంపించమని చెప్పాడు. వినోద్ ఉద్యోగం పేరుతో ఆ యువతిని పంపించాడు. అనూష హోటల్లోని రవికుమార్ గదిలోకి వెళ్లగానే భానుప్రకాశ్ స్నేహితులు సాయి ఓ ఛానల్ రిపోర్టరుగా, సందీప్ టాస్క్ ఫోర్స్ పోలీసుగా వచ్చారు.
వ్యభిచారం చేశారంటూ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారు. రవికుమార్ వద్ద ఉన్న డబ్బు, బంగారు గొలుసులు, ఉంగరాలు తీసుకున్నారు. మొత్తం దాదాపు రూ.ఐదున్నర లక్షలను కాజేశారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో టెక్కీ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.