నేను ఐపీఎస్, నా చెల్లితో పెళ్లి చేస్తా..: వ్యాపారి వద్ద రూ. 11 కోట్లు కాజేసిన మహిళ అరెస్ట్
హైదరాబాద్: తాను ఐపీఎస్ అధికారినంటూ పెళ్లి పేరుతో ఏకంగా రూ. 11 కోట్లు కాజేసిన ఓ మహిళను, ఆమెకు సహరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారీగా ఆస్తులున్నాయంటూ వీరారెడ్డిని నమ్మించి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా అనే మహిళ నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తింది. తన వద్ద భారీగా ఆస్తులున్నట్లు హైదరాబాద్ నగరానికి చెందిన వీరారెడ్డి అనే వ్యాపారిని నమ్మించింది. అతని సోదరుడికి తన చెల్లెలితో వివాహం జరిపిస్తానని నమ్మబలికింది. అంతేగాక, తాను జాతీయ మానవ హక్కుల ఛైర్మన్గా అతనికి పరిచయం చేసుకుంది.
రూ. 11 కాజేసిన మహిళ...
వీరారెడ్డి వద్ద నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుంది. మొత్తంగా రూ. 11 కోట్లు అతని వద్ద నుంచి కాజేసింది. కొద్ది రోజుల తర్వాత తను మోసపోయానని తెలుసుకున్న వీరారెడ్డి.. పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రుతి సిన్హాతోపాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. శ్రుతి వద్ద నుంచి రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.
భర్తను వదిలేసిన నిందితురాలికి ఇద్దరు పిల్లలు.. ఒకరి ప్రాణం తీసింది
కాగా, శ్రుతితో కలిసి ఈ మోసాలకు పాల్పడిన ఆమె బంధువు విజయ్ కుమార్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 72 వోల్వో బస్సులు, బాచుపల్లిలో 32 ఎకరాల పార్కింగ్ స్థలం ఉందని శ్రుతి చెప్పిన మాటలు నమ్మి.. వీరారెడ్డి మోసపోయారని పోలీసులు తెలిపారు. డబ్బులుంటే బ్యాంకులో పెట్టుకోవాలని కానీ, ఇలా మోసగాళ్లకు చిక్కద్దన్నారు. కాగా, నిందితురాలు కొన్నేళ్ల క్రితమే భర్తను వదిలేసిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఆమె మోసాల కారణంగా ఒకరు ప్రాణం తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.