'నందమూరి సుహాసినికి భారీ మెజార్టీ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అసత్యపు ప్రచారం'
Recommended Video
హైదరాబాద్: తనకు ఓటు వేసి గెలిపిస్తే నిత్యం కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని చెప్పారు. కూకట్పల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం మేనిఫెస్టో వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హాజరయ్యారు.
ఎక్కువ పని చేసి, తక్కువ మాట్లాడుతా
తనను నమ్మి ఓటు వేస్తే, ఎక్కువ పనిచేసి, తక్కువ మాట్లాడుతానని సుహాసిని చెప్పారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేస్తానని, నియోజకవర్గానికి సేవ చేస్తానని చెప్పారు. నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. తాను ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండనని ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ ప్రచారం అబద్దమని చెప్పారు.
అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో
తాను ఎల్లప్పుడూ, 24 X7 కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తనను ఒక్కసారి గెలిపించాలని, అయిదేళ్లు వారికి తోడుగా ఉంటానని సుహాసిని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె నియోజకవర్గ ప్రజలను కోరారు.
సుహాసినికి భారీ మెజార్టీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్
ప్రజాసేవ చేసేందుకు నందమూరి వంశం నుంచి వచ్చిన సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని సర్వే సత్యనారాయణ అన్నారు. టీడీపీ అత్యధిక ఓట్లతో గెలిచే సీట్లలో కూకట్పల్లి కూడా ఉందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయని ఆయన చెప్పారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని చెప్పారు. కాబట్టి తెరాస గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. సుహాసిని గెలుస్తుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినందునే అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
సుహాసినికి అలాంటి అవసరం లేదు
సుహాసిని క్లీన్ హ్యాండ్స్తో వచ్చారని సర్వే సత్యనారాయణ చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు దండుకోవాలని, భూములు లాక్కోవాలని కాదని చెప్పారు. ఆమెకు లేదా ఆమె కుటుంబానికి అలాంటి అవసరం లేదని చెప్పారు. అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని ఆమె వచ్చారని చెప్పారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే సుహాసినిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే హరికృష్ణకు నిజమైన నివాళి అర్పించినట్లే అన్నారు.