రాంగోపాల్ వర్మ 'దిశ' చిత్రాన్ని నిలిపివేయాలి... సుప్రీం జ్యుడీషియల్ కమిషన్కు ఫిర్యాదు...
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న 'దిశ' చిత్రాన్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ దిశ హత్యాచార నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టు జ్యుడీషియల్ కమిషన్ను ఆశ్రయించారు. దిశ చిత్రంలో తమవాళ్లను విలన్లుగా చిత్రీకరిస్తూ చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కమిటికీ ఫిర్యాదు చేశారు. ఇది నిందితుల కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. చనిపోయినవాళ్లపై సినిమా తీయడం తమను మానసికంగా హత్య చేయడమేనని వాపోయారు.
ఓవైపు దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు సినిమా తెరకెక్కించడమేంటని ఫిర్యాదులో ప్రశ్నించారు. కాబట్టి ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం జ్యుడీషియల్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ నిందితులు జొళ్లు శివ, జొళ్లు నవీన్, చెన్నకేశవులు,ఆరిఫ్ల కుటుంబ సభ్యులు సోమవారం(అక్టోబర్ 31) హైదరాబాద్లోని హైకోర్టుకు చేరుకుని సుప్రీం జ్యుడీషియల్ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఇదివరకే దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
రంగారెడ్డిలోని షాద్నగర్ సమీపంలో ఉన్న చటాన్పల్లి బ్రిడ్జి వద్ద గతేడాది నవంబర్ 27న వెటర్నరీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. అత్యాచారం అనంతరం బాధితురాలిని నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు అరెస్ట్ చేయగా... డిసెంబర్ 6న సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు మృతి చెందారు. నిందితులు పారిపోయేందుకు యత్నించడంతోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో... సర్వోన్నత న్యాయస్థానం దీనిపై ముగ్గురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది.
మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కార్ అధ్యక్షతన బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాష్, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్. కార్తీకేయన్లు సభ్యులుగా కమిషన్ను నియమించింది.ఈ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్కు చేరుకుని.. నిందితుల పోస్టుమార్టం, రీపోస్టుమార్టం రిపోర్టులను పరిశీలించింది. అలాగే ఎన్కౌంటర్పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నివేదికను పరిశీలించింది. ఇంతలోనే కరోనా లాక్ డౌన్ విధించడంతో విచారణకు బ్రేక్ పడింది.