భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....
తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో అతని కుటుంబసభ్యులు రగిలిపోయారు. తమ నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకొని .. తమ చేతులకు పనిచెప్పారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం, జంబారకు చెందిన భీంరావుకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్లు దంపతులు బాగానే ఉన్నారు. తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భర్త భీం రావు .. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
హత్య కేసు విచారణ ఉండటంతో మంగళవారం స్థానిక సబ్ జైలు నుంచి ఎస్కార్ట్ పోలీసులు అతనిని కోర్టుకు తీసుకెళుతున్నారు. అతడిని చూసిన మృతురాలి కుటుంబసభ్యులు రెచ్చిపోయారు. నిందితుడు భీంరావుపై దాడికి తెగబడ్డారు. అందరూ చూస్తుండగా, ఎస్కార్ట్ పోలీసులు అడ్డుకోగా కూడా ఆగలేదు. తమ కసి తీరా కొట్టారు. ఎలాగోలా పోలీసులు కలుగజేసుకొని అతడిని .. వాహనంలో తీసుకెళ్లారు. అక్కడున్న కొందరికీ ఏం జరుగుతుందో తెలియలేదు. తర్వాత విషయం తెలిసి .. అతడికి తగిన గుణపాఠం చెప్పారని ... బంధువులు చేసింది కరెక్టే అని అభిప్రాయపడ్డారు.