నాడు అశోకుడు.. నేడు కెసిఆర్: సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, 230 కోట్ల మొక్కలు నాటాలన్న నిర్ణయం ఇప్పటి వరకు దేశంలో ఎవరూ తీసుకోలేదని అభినందించారు.
అంతేగాక, నాడు అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించినట్లు చరిత్రలో చదువుకున్నామని, నేడు సీఎం కెసిఆర్ అందరితో మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గచ్చిబౌలి డివిజన్లోని నానక్రాంగూడ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల, కుమారుడు నరేష్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ నిర్మాత విజయనిర్మల మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. నటుడు నరేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హరితహారం దేశానికే ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతరాములు, డాక్టర్ రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, వినోద్, జగదీశ్ పాల్గొన్నారు.