కవిత పదవి కోసం కెసిఆర్ చక్కర్లు: రేవంత్, కెసిఆర్ ఫామ్హౌస్పై యాష్కీ
హైదరాబాద్/ మహబూబ్నగర్: తన కూతురు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పదవి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రూ. లక్షా 15వేల కోట్ల బడ్జెట్లో రూ. 2 వేల కోట్ల ఉపకార వేతనాలు చెల్లించకపోవడం దారుణమని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితోనే ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించడం లేదని ఆయన అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
హాస్టళ్లకు సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు విద్యార్థులకు పెట్టే అన్నంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. యూనివర్సిటీలకు వీసీలను ఎందుకు నియమించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తామని విద్యార్థులకు అండగా ఉంటామని రేవంత్రెడ్డి భరోసాయిచ్చారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు.
బీహార్లో మోదీకి పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని ఆయన అన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేసీఆర్ ఫాంహౌస్ మారిందని విమర్శించారు. జగన్, కేసీఆర్ల కుట్రలో భాగంగానే వైసీపీ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయలేదని మధుయాష్కీ చెప్పారు.