'జీన్స్, షర్ట్ వేసుకుంటే ఆత్మహత్య ఎలా?' 'రాజీవ్తో అక్రమ సంబంధమే ఉంటే..'
బ్యూటీషియన్ శిరీష కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా, శిరీష తన ఫోన్ వాట్సాప్ నుంచి భర్తకు రెండు లొకేషన్లు పంపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా, శిరీష తన ఫోన్ వాట్సాప్ నుంచి భర్తకు రెండు లొకేషన్లు పంపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అలాగే, శిరీష జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుంటే చున్నీతో ఎలా ఉరివేసుకుంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు. శిరీష వద్దకు చున్నీ ఎలా వచ్చిందో చెప్పాలంటున్నారు.
ఆరు అడుగుల పొడవు, దాదాపు ఎనభై కిలోలున్న శిరీష ఫ్యాన్కు ఉరేసుకోవడం ఎలా సాధ్యమని కూడా ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జీన్స్, షర్ట్ వేసుకున్న ఆమె చున్నీతో ఉరేసుకుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
బాబాయి మరో సంచలన ఆరోపణ..
శిరీష మృతిపై బెంగళూరులోని ఆమె బాబాయి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఎన్నో విషయాలు మాట్లాడారు. మరో విషయం కూడా చెప్పారు. శిరీషపై బురద జల్లుతున్నారని, తమ బిడ్డ అలాంటిది కాదని, చాలా విషయాలను పోలీసులు దాస్తున్నారని, దర్యాప్తు సమగ్రంగా జరగడం లేదన్నారు. శిరీష కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి అన్నారు. నిందితులు, పోలీసులు, మీడియా చెబుతున్నట్టు రాజీవ్తో ఆమెకు అక్రమ సంబంధం ఉండి ఉంటే కుక్కునూరుపల్లిలో ఎస్సైకి సహకరించి ఉండేదన్నారు. అయిదు నిమిషాలు ఎస్సైకి సహకరించి ఉంటే ఇంత జరిగి ఉండేదా? అని ప్రశ్నించారు. ఆమె వ్యక్తిత్వం గురించి తెలియని పోలీసులు, మీడియా చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. ఆమె మెడచుట్టూ నైలాన్ తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయని ఆయన చెప్పారు. నైలాన్ తాడుతో బిగించి చంపి, తరువాత చున్నీతో వేలాడదీస్తే, మెడదగ్గర ఎముకలు విరగవా? అని ఆయన ప్రశ్నించారు. శిరీషది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఆయన స్పష్టం చేశారు.
ఆ కోణంలోనూ..
ఇదిలా ఉండగా, శిరీషను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కాకుండా మరో చోటుకు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. శిరీష తన మొబైల్ నుంచి రెండో లొకేషన్ను పంపించింది. అది దగ్గర్లోని ఫాంహౌస్. దీంతో ఎస్సై, రాజీవ్, శ్రవణ్లు ఆమెను అక్కడికి తీసుకు వెళ్లారా అనే కోణంలో దర్యాఫ్తు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. శిరీషను పోలీస్ స్టేషన్కు కాకుండా ఫాంహౌస్కు తీసుకు వెళ్లారని, అక్కడ ఆమెను చంపేశారని కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.
తవ్వేకొద్ది కొత్త విషయాలు
బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తవ్వేకొద్ది పోలీసులకు కూడా ఎన్నో వాస్తవాలు తెలుస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి తోడు శిరీష కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన భర్తకు ఆమె వాట్సాప్ ద్వారా కుకూనురూపల్లిలోని మరో లొకేషన్ను పంపించింది. దీంతో ఆమెను హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీస్ స్టేషన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్టుకు ఆమెను తీసుకు వెళ్లారని అంటున్నారు. రిసార్టు ఏరియాతో ఆమె పంపిన వాట్సాప్ ఏరియా సరిపోయినట్లు చెబుతున్నారు.
ముగ్గురు కలిసి చంపేశారని..
శిరీష మృతి కేసును బలహీనపరిచేందుకు ఆమెపై నిందలు వేస్తున్నారని బెంగళూరులో ఉంటున్న శిరీష బాబాయి ఆరోపించిన విషయం తెలిసిందే. ఎస్సై ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్, రాజీవ్లు కలిసి శిరీషను హత్య చేశారని శ్రీనివాస రావు సంచలన ఆరోపణ చేశారు. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శిరీషను ఫాంహౌస్ తీసుకు వెళ్లి అక్కడ జుట్టుపట్టి కొట్టడంతో ఆమె తలకు గాయమైందని బాబాయి శ్రీనివాస రావు అంటున్నారు. శిరీష కేసులో ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి, వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చిన్న దొంగతనం జరిగితేనే సిసిటివి ఫుటేజీ చూస్తారని, కానీ శిరీష మృతి కేసులో ఫుటేజీలు లేవని చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు. శిరీష మృతిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తేజస్విని వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని బాబాయి ప్రశ్నించారు. శిరీష వ్యక్తిత్వం తనకు తెలుసునని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి బతకగలుగుతుందని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు శిరీషపై మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.