రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!
నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 52 సంవత్సరాల రైతు అంతారం ఈర్రెడ్డి కి సత్యగామ శివారులో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా బేగంపేటకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మొదటి విడత రైతుబంధు కింద ఆయనకు 32,800 చెక్కు మంజూరైంది.
ఇక రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈర్రెడ్డి ఇంటి పేరుతో పాటు బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్రెడ్డి తరచుగా దిగులు పడేవాడు. ఈనెల 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి శుక్రవారం ఉదయం సొంత వ్యవసాయ భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది.