గోస మీద గోస..! రైతన్న పంట ఆసాంతం నేలమట్లం..!!
హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మండువేసవిలో కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగించాయి. ఖమ్మం, సిద్దిపేట, నాగర్కర్నూల్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానలు పడటంతో రైతులు బెంబేలెత్తిపోయారు. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహించాయి.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు..! పంటలన్నీ నేలమట్టం..!!
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో వడగళ్లు పడ్డాయి. ఈ కారణంగా వరి, ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, సపోటా తదితర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడితోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు పాడయ్యాయి. మార్కెట్లకు తెచ్చి అమ్మకానికి ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది.
అపార నష్టం..! పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన..!!
తడిసిన పంటను మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నారు. గోదాములకు తరలించకుండా మార్కెట్లలో ఆరుబయట ఉంచిన ధాన్యం కూడా తడుస్తోంది. ఇలా నిరంతరాయంగా వేసవిలో వర్షాలు కురుస్తాయని అంచనా వేయనందున నష్టపోయినట్లు రైతులు, అధికారులు చెప్పారు. పంట నష్టాలపై పరిశీలన చేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
మరో మూడు రోజులు వర్షాలు..! మరింత ఇబ్బంది పడనున్న రైతులు..!!
రాష్ట్రంలో శనివారం నుంచి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకూ 385 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల నిరంతరాయంగా జల్లులు పడుతున్నాయి. అత్యధికంగా యాదగిరిగుట్టలో 71.3 మిల్లీమీటర్లు(మి.మీ.) స్టేషన్ ఘన్పూర్లో 29.3, శాయంపేట, యాచారం, గోవిందరావుపేటల్లో 30, ములుగు(సిద్దిపేట జిల్లా) 31.5, రాజేంద్రనగర్ 29.3, ముదిగొండ 16.5, తుర్కపల్లి 14.5, కాజీపేట 11.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో ఎండ తీవ్రత తగ్గి చల్లదనం ఏర్పడింది.
ధాన్యాన్ని గోదాములకు తరలించండి..! మార్కెటింగ్ మంత్రి పిలుపు..!!
రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నందున మార్కెట్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, అమ్మకానికి వచ్చినవి తడిసిపోకుండా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో మార్కెట్లలో సాంకేతిక సమస్యలతో కరెంటు సరఫరా ఆగిపోతో బ్యాటరీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా విరివిగా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మార్కెట్లలో సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు.