రైతులు,పురుషుల సంగతి సరే..!మరి నిజామాబాద్ లో మహిళల మనోభీష్టం ఎటువైపు..!!
నిజామాబాద్/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్ లో ఏకంగా 183 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ప్రపంచలోనే తొలిసారిగా అత్యధిక బాలెట్ బాక్సులు వాడి ఎన్నిక నిర్వహించారు. తొలిసారిగా ఎన్నికల సంఘం ఇక్కడ ఎం3 రకం ఈవీఎలను వినియోగించింది. దీంతో నిజామాబాద్ ఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అదీగాక ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. అంతే కాకుండా ఎప్పుడూ లేని విధంగా మహిళలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరి పోటెత్తిన మహిళా ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటేసారని అంచనా వేయడం మాత్రం కష్టంగా మారింది.
నిజామాబాద్లో మహిళల దారెటు..? పురుషులతో పోటీ పడ్డ మహిళలు..!!
ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల కవిత గెలుపు గురించి అంచనాలే కాకుండా ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు నిలవడంతో ఎంతమేర మెజార్టీ సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పసుపు, ఎర్రజొన్న రైతులు ఇక్కడ భారీ నామినేషన్లు వేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పుడు అభ్యర్థులందరూ ఎవరికివారు గెలుపు విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఒక విషయం బాగా కలవరపరుస్తున్నట్టు తెలుస్తోంది.
ఆసక్తిగా నిజామాబాద్ పోలింగ్..! నిద్రలేచిన మహిళా లోకం..!!
గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా జరిగిన ఈ ఎన్నికలో అంతే ఆసక్తిగా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడం ఉత్కంఠ రేపుతోంది. వీరు ఎటు వైపు మళ్లి ఓటు వేశార్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళా ఓట్లు పడిన అభ్యర్థి గెలవడమే కాదు మంచి మెజార్టీతో బయట పడతారని స్పష్టమవుతోంది. ఈ ఓట్లన్నీ గులాబీ పార్టీకే పడ్డాయా లేదా అన్నది మే 23న తెలుస్తుంది.
మహిళా ఓట్లు ఎటువైపు..! కష్టంగా మారిన అంచనా..!!
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 15లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 68.33శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 64.22 కాగా, మహిళా ఓటింగ్ శాతం 72.06 కావడం విశేషం. అంటే పురుషుల కంటే మహిళా ఓటింగ్ శాతం 8శాతం ఎక్కువగా ఉంది. పురుషుల కంటే 1.13లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారు.
కల్వకుంట్ల కవితకు పోలైన ఓట్ల శాతం ఎంత..! అసలు నిజామాబాద్ లో ఏంజరిగింది..?
ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వీరు అధికంగా ఓటు వేశారు. ఇక్కడ 27,272 మంది మహిళలు, పురుషుల కంటే ఎక్కువగా ఓట్లు వేశారు. ఇలా మహిళా ఓట్లు అధికంగా పోలవ్వడంతో అది ఎవరికి లాభాస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. కీలక మహిళా నేత పోటీ చేసిన స్థానంలో మహిళల ఓట్లు గెలుపోటముల్లో కీలకం కావడం చర్చనీయాంశంగా మారింది.