coronavirus: టోకెన్ ఆధారంగా పంటల కొనుగోలు, రైతులు సహకరించాలి: మంత్రి హరీశ్ రావు
కుల, మతం, ధనిక, పేద అనేది.. కరోనా వైరస్ చూడదని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. వైరస్కు మందు సామాజిక దూరం, తగిన జాగ్రత్తలేనని తెలిపారు. కరోనాతో అమెరికా, ఇటలీ ఆందోళన చెందుతున్నాయని వివరించారు. 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీ జనాభాను అదుపు చేయకపోయింది.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం కట్టడి చేస్తోందని చెప్పారు. ఒకవేళ జనాభాను కట్టడి చేయలేకుంటే పరిస్థితి మరోలా ఉండదని అభిప్రాయపడ్డారు. బుధవారం మంత్రి హరీశ్ రావు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నర్సరీను పరిశీలించారు. తర్వాత గ్రామంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని మంత్రి వివరించారు. మరోవైపు రైతు సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తోందని చెప్పారు. ఆయా గ్రామాల్లోనే రైతుల పంట కొనుగోలు చేస్తామని, ఇందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పంట కోసిన తర్వాత బాగా ఆరబెట్టాలని సూచించారు. తర్వాత ఇచ్చిన టోకెన్ మేరకు కొనుగోలు కేంద్రాలకు రావాలని సజెస్ట్ చేశారు. ప్రతీ పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి బెంగ పెట్టుకొవద్దన్నారు.
Recommended Video
పంట కొనుగోలు కోసం 14 కోట్ల గన్ని బ్యాగులు అవసరమవుతాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద 7 కోట్ల బ్యాగులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మిగతా వాటిని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఒకవేళ పాత గన్ని బ్యాగులు ఉంటే రైతులు తీసుకురావాలని కోరారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లు తమ వెంట రైతులు తీసుకొని రావాలన్నారు. పంజాబ్ నుంచి 150 ప్యాడి మిషన్లను సిద్దిపేటకు తీసుకొస్తున్నామని వివరించారు.