బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో పరాభవం తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరును ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు మద్దతు తెలపడం ద్వారా కేంద్రంపై ఆయన సమరశంఖం పూరించారు. ఒకవైపు రాష్ట్రంలో ఈఏడాదికి రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేస్తూనే, ఢిల్లీ వేదికగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలకు తెలంగాణ సీఎం బాసటగా నిలిచారు. బీజేపీ నుంచి సవాళ్లు ఎదురవుతోన్న వేళ నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..
Recommended Video
భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు ఆదివారంతో 11వ రోజుకు చేరాయి. రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం శనివారం జరిపిన చర్చలు విఫలంకాగా, ఈనెల 9న(బుధవారం) మరోమారు రైతు నాయకులతో సమావేశమవుతామని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసగా రైతు సంఘాలు ఈనెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. 8న(మంగళవారం) రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు.
రైతులకు అండగా కేసీఆర్..
మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని, కాబట్టే వాటిని పార్లమెంటులో వ్యతిరేకించామని ఆదివారం నాటి ప్రకటనలో కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నది న్యాయమైన పోరాటమన్న కేసీఆర్.. సదరు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని, అందుకు టీఆర్ఎస్ తనవంతుగా మద్దతు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 8న భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, ప్రజలంతా రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు..
రెండో విడత రైతుబంధుపై..
రైతుల నిరసనల అంశంలో కేంద్రంలోని బీజేపీపై పోరాడుతూనే.. తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వ సహాయ సహకారాలపై కేసీఆర్ దృష్టిసారించారు. ఈ నెల 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీ పై ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ నుంచి సవాళ్లు ఎదురవుతోన్న తరుణాన, ప్రభుత్వ, పార్టీ పరమైన కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా..
తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణం
10న సిద్దిపేటకు.. ఆపై భద్రాద్రికి..
ప్రతి జిల్లాలో తెలంగాణ భవన్లు, పూర్తయిన కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు, ఆయా జిల్లాల అధికారులతో, నేతలతో కూడా నేరుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న కేసీఆర్ ఆ పనిని ముందుగా సొంత జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. ఈనెల 10న సీఎం సిద్ధిపేటలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన భారీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వాటిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఆ తర్వాత, త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సీఎం పర్యటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో సీతమ్మ సాగర్ శంకుస్థాపన, తెలంగాణ భవన్ ల ప్రారంభోత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారని, అదే రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించడంతోపాటు బహిరంగ సభలోనూ పాల్గొనే అవకాశముంది. త్వరలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటన వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు..
మళ్లీ తెరపైకి ఫెడరల్ ఫ్రంట్
దేశంలో యూపీఏ, ఎన్డీఏలకు మూడో ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తీరుతానన్న కేసీఆర్.. ఈ దిశగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కాంక్లేవ్ నిర్వహిస్తానని కూడా కేసీఆర్ చెప్పడం తెలిసిందే. ఇందులో భాగంగానే.. జేడీయూ కీలక నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారని, త్వరలోనే భేటీ అవుదామని కోరారని తెలిసింది.
ఈ విషయాన్ని శనివారం కుమార స్వామి మైసూరులో మీడియాకు వివరించారు. లోక్సభ ఎన్నికలకు మరో మూడేళ్లు ఉండగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ ఫోన్ చేసిన విషయాన్ని జేడీఎస్ నేత కుమారస్వామి ధృవీకరించగా, ప్రగతి భవన్ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.