లోక్ సభ ఎన్నికల బరిలో రైతన్నలు , మొన్న నిజామాబాద్, నిన్న జగిత్యాల , నేడు ఖమ్మం
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో రాజకీయ చైతన్యం వస్తుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు రైతన్నలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు వినూత్న రీతిలో తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ డిమాండ్లపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా నిర్ణయం తీసుకున్న రైతులు ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.మొన్న నిజామాబాద్ జిల్లా రైతులు, నిన్న జగిత్యాల రైతులు, నేడు ఖమ్మం జిల్లా రైతులు.. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ లోక్సభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిలా రైతులు చూపిన బాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్లో ఉన్న రైతులకు దిశా నిర్దేశం చేస్తుంది.
నిజామాబాద్ జిల్లా పసుపు, ఎర్రజొన్న రైతులు లోక్ సభ ఎన్నికల బరిలో
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని ఎర్ర జొన్న, పసుపు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసి చివరకు లోక్ సభ ఎన్నికలలో వెయ్యి మంది రైతులు పోటీచేసి తమ సమస్యను జాతీయస్థాయిలో అందరికీ తెలిసేలా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం కార్యాచరణ రూపొందించిన రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూనే, పరిష్కారం చేయకుండా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం తీరుకు నిరసనగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
జగిత్యాల చెరుకు రైతులు నామినేషన్లు వెయ్యాలని నిర్ణయం
ఇక జగిత్యాల రైతులు జగిత్యాల జిల్లా లక్ష్మాపూర్ తదితర గ్రామాల నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. వంద రోజుల్లో నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ మాట మార్చడంతో జగిత్యాల జిల్లా చెరుకు రైతులు నామినేషన్లు వేయడానికి సై అంటున్నారు. భారీ స్థాయిలో చెరుకు రైతులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లకు స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా నామినేషన్లు వేయాలని జగిత్యాల రైతులు భావిస్తున్నారు.
కవితకు ఎన్నికల గండం ... కవితపై పోటీకి వెయ్యి మంది రైతాంగం .. కేసీఆర్ ఏం చేస్తారో ?
నామినేషన్లు దాఖలు చేసే ఆలోచనలో ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు
ఇక ఇదే క్రమంలో ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారంలో సుబాబుల్ రైతులు సమావేశమయ్యారు.ఖమ్మం లోక్సభ స్థానంలో 20మంది రైతులు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఐదుగురు రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాల నేతల సమాచారం బట్టి తెలుస్తోంది.
రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ నేతలు
రైతు సమస్యలను పరిష్కరిస్తానని నిజామాబాద్లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన వీరు నామినేషన్లు వేయడం గమనార్హం. అయితే, నామినేషన్లు వేసేందుకు పెద్దఎత్తున ఫారాలు తీసుకెళ్లిన రైతులను బుజ్జగించే పనిలో పడ్డారు స్థానిక నాయకులు.
ఏది ఏమైనా రైతాంగ సమస్యల పరిష్కారాల కోసం ఎన్నికల బరిలోకి దిగాలి అనుకోవడం రైతులలో వస్తున్న చైతన్యానికి ప్రతీక. రాజకీయాల్లోకి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరహాలో రైతులు వ్యూహాత్మకంగా ముందుకు వస్తే రైతుల కనీస డిమాండ్ అయిన గిట్టుబాటు ధరను సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ఊహించని విధంగా రైతులు తీసుకుంటున్న నిర్ణయం రాజకీయవర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.