తల్లి అంత్యక్రియలకు వెళ్తూ: రిటైర్డ్ సీఐ, భార్య దుర్మరణం: అతివేగం..నిర్లక్ష్యం.. !
వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తన తల్లి అంత్యక్రియకుల బయలుదేరి వెళ్లిన ఓ కుటుంబ ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన భార్య దుర్మరణం పాలయ్యారు. కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ ఆమెను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ వద్ద ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ విజయ్ కుమార్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆయన స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని యాపిల్ గూడ. విజయ్ కుమార్ తల్లి అక్కడే నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఆమె అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుమార్.. భార్య సునీత, కుమార్తెతో కలిసి కారులో యాపల్ గూడకు బయలుదేరారు.
మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా పెంచికల్ సమీపానికి రాగానే.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విజయ్ కుమార్, సునీత అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వరంగల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయ్ కుమార్, ఆయన భార్య మృతితో రమణమ్మ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. విజయ్, సునీతల మృతదేహాలతో కలిపి అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ ఘటనతో యాపల్ గూడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొన్ని గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించిన ఉదంతం పట్ల గ్రామస్తులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.