ఆడపిల్ల పుట్టిందని 48 రోజుల పసికందు గొంతు నులిమి చంపేశాడు
హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ కసాయి తండ్రి 48 రోజుల పసికందును అతి క్రూరంగా చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని టేక్మాల్ మండలం మేరగోనిగుంట తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కన్న తండ్రే 48 రోజుల ఆడ శిశువుని గొంతు నులమడంతో చిన్నారి మరణించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాప్రా చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
హైదరాబాద్ శివారులోని కాప్రా చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా మృతదేహం బాగా కుళ్లిపోయి ఉందని, సదరు వ్యక్తిని గుర్తించడం కష్టసాధ్యంగా మారిందని పోలీసులు తెలిపారు.
అనుమానాస్ప స్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకున్నామని, హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని తెలిపారు.
చెరకు పంట దగ్ధం
ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులకు చెందిన విలువైన చెరకు పంట దగ్ధమైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సదాశివనగర్ మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం యెన్నం రాములు అనే రైతుకు చెందిన 4 ఎకరాలు, రాజయ్య అనే రైతుకు సంబంధించిన 2 ఎకరాల్లోని చెరకు పంట కాలి బూడిదైంది.
విద్యుత్ హై టెన్షన్ తీగలు పొలంలో చాలా కిందకి ఉన్నాయని, వీటి వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని బాధిత రైతులు పేర్కొంటున్నారు.