భార్య, కొడుక్కి మత్తుమందు ఇచ్చి.. కన్న కూతురిని తండ్రి ఏం చేశాడంటే...
కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. వరంగల్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది.
వరంగల్: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. వరంగల్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...
వరంగల్ కు చెందిన, రైల్వే శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతోద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి కన్న కూతురన్న విచక్షణ కూడా మరిచాడు. ఎప్పట్నించి కన్నేశాడో తెలియదుగానీ.. శనివారం రాత్రి పక్కా ప్రణాళికతో భార్య, కొడుకు, కూతురికి మత్తుమందు ఇచ్చాడు.
ఆ మందు ప్రభావంతో వారంతా నిద్రలోకి జారుకోగానే అదే అదనుగా కూతురిపై అత్యాచారం చేశాడు. ఉదయం నిద్రమత్తు వీడిన తరువాత అనుమానం వచ్చిన కూతురు విషయం తల్లితో చెప్పింది.
దీంతో ఆమె తల్లి తన దగ్గరి బంధువుల సహాయంతో కూతురిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లీకూతుళ్లు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
వారి సూచన మేరకు ఆదివారం ఉదయం స్థానిక పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు కూడా ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
దీంతో ఆ అమ్మాయి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పదిహేను రోజుల క్రితం కూడా తన భర్త ఇలాగే కూతురిపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది.
పరామర్శించిన ఎమ్మెల్యే...
ఈ అఘాయిత్యం గురించి తెలియగానే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమె తల్లితో మాట్లాడారు. తన భర్త చాలా రోజులుగా ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి రోదిస్తూ ఎమ్మెల్యేను కోరినట్లు తెలిసింది.
మరోవైపు స్థానిక సీఐ కూడా బాధితురాలి ఇంటికి వచ్చి విచారణ జరిపారు. వారి ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కన్నకూతురిపై ఆమె తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.