రెండో భార్యతో కలిసి తండ్రి కూతురికి వాతలు: నలుగురి కిడ్నాప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలోని ఎల్బీనగర్లో కూతురి పట్ల ఓ ఉన్నతాధికారి అత్యంత ఘాతుకానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. చిన్నారిని తండ్రే చిత్రహింసలకు గురి చేశాడు. ఆరేళ్ల చిన్నారిని సొంత తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల చిత్రహింసలకు గురిచేశారు.
బాలిక వంటి నిండా వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం పోలీసుల సాయంతో బాలికను చెర నుంచి విడిపించారు. పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకోగా రమేష్ పరారీలో ఉన్నాడు. రమేష్ టెలికాంశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.
సికింద్రాబాదు నగరంలోని చిలకలగూడలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్కు గురైయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గడిచిన రాత్రి క్రైం బ్రాంచ్ పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు అంజలి, లక్ష్మీ, నర్సింహారావు, శ్రవణ్లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల పేరు చెప్పి వారిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఓ చీటింగ్ కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. కాగా పోలీసుల ముసుగులో కొందరు దుండగులు కిడ్నాప్ కు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నేడు 350 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రయణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారులు ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.