మూడేళ్ల కుమారుడ్ని నరికి చంపిన తండ్రి
హైదరాబద్: ఖమ్మం జిల్లాలో కన్నతండ్రే కుమారుడి పట్ల కాలయముడిగా మారాడు. అతి దుర్మార్గంగా వ్యవహరించిన ఓ తండ్రి ముక్కు పచ్చలారని మూడేళ్ళ కొడుకుని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం చేగడ గ్రామంలో జరిగింది.
కొమ్ము వసంతరావు అనే వ్యక్తి మంచంలో నిద్రిస్తున్న మూడేళ్ళ కొడుకు మరియా రక్షక్ ని నిద్రలేపి నిలబెట్టి తన చేతిలో ఉన్న గొడ్డలితో నరికేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. రోజు కూలీగా పని చేస్తున్న వసంతరావుకు, భార్య శాంటాతో గొడవలేమీ లేవని, భార్యపైన అనుమానం కూడా లేదని పోలీసులకు చెప్పాడు. కన్నకొడుకుని హత్య చేయడానికి గల కారణాలు మాత్రం చెప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి వసంతరావుని విచారిస్తున్నారు.
ఉద్యోగాలిప్పిస్తామని మోసం
కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగులకు కోర్టుల్లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు. మోసపోయిన వారు హుజూరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు వారిని వల పన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దొంగల హల్ చల్
మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఎనిమిది ఇళ్లలోకి చొరబడి దొరికినంత దోచుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.