ప్రగతి నివేదన సభలో ఆసక్తికరం: ఎస్పీ కూతురుకు డీసీపీ తండ్రి సెల్యూట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి భారీ బహిరంగ సబ ప్రగతి నివేదన సభ వద్ద ఆదివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 20 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక వేదిక వద్ద తండ్రి, కూతురు బందోబస్తు అధికారులుగా విధులకు హాజరయ్యారు.
తనకన్నా పెద్ద హోదాలో విధుల్లో ఉన్న కుమార్తెకు.. ఓ తండ్రి సెల్యూట్ చేశారు. ఆ తండ్రి మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ. కూతురు జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ. వీరిద్దరూ ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో డ్యూటీలో ఉన్నారు.
సాంస్కృతిక వేదిక, మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు ఇంచార్జ్గా సింధూ ఉన్నారు. అదే సమయంలో ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తుకు ఇంచార్జిగా ఉన్నారు. ఉమామహేశ్వర శర్మ 1985 సంవత్సరంలో ఎస్ఐగా విధుల్లో చేరి నాన్ క్యాడర్ ఎస్పీ హోదాకు వచ్చారు. సింధూ 2014 బ్యాచ్ ఐపీఎస్గా ఎంపికై పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. పోలీసు డ్యూటీలో భాగంగా నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ఉమామహేశ్వర శర్మ ఐపీఎస్ అధికారిణి అయిన కూతురు సింధూకు సెల్యూట్ చేశారు.