మూడున్నార గంటల్లోనే హైదారాబాద్ టు ముంబాయి : బుల్లెట్ రైల్ రూట్ మ్యాప్ సిద్దం : టెండర్లు-డీపీఆర్..!!
హైదరాబాద్ మరో కీర్తి అందుకోబోతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నుంచి దేశ వాణిజ్య రాజధాని మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదనలకు ఇప్పుడు కార్య రూపం మొదలైంది. కేంద్రం బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కొత్త ప్రతిపాదనకు డీపీఆర్ సిద్దం చేయాలని నిర్ణియించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ముంబాయికి మెట్రో రైల్ కోసం ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ప్రతిపాదించింది.
Recommended Video
బుల్లెట్ రైలు ప్రీ బిడ్ మీటింగ్
కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 బుల్లెట్ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉన్నది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ను 2028లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నవంబర్ 5న ముంబాయి- హైదరాబాద్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ తెలిపారు. అదే నెల 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు.
తాజాగా అలైన్ మెంట్ ప్రతిపాదన
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్ను లింక్ చేస్తూ నిర్మించాలని అనుకున్నారు. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై-పుణె-జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా- తాండూరు -వికారాబాద్ మీదుగా హైదరాబాద్కు అలైన్మెంట్ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది.
రూట్ మ్యాప్ పనులు ఆరంభం
ఐదు మండలాలు..40 గ్రామాలు..ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఆధ్వర్యంలో బుల్లెట్ రైల్వే లైన్ సర్వే పనులు చేపట్టారు. వికారాబాద్ జిల్లాపరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు. జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్, ధరూర్, వికారాబాద్, నవాబ్పేట్ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేపట్టనున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు లైన్ ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్ పనులు ప్రారంభమయ్యాయి.
గంటకు గరిష్ఠంగా 350 కిలో మీటర్ల వేగం
త్వరలోనే ప్రభావిత అంశాల అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) చేపట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే సాగుతున్నది. గూగుల్ మ్యాపింగ్ చివరి దశకు చేరింది. గూగుల్ మ్యాపింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుతం హైస్పీడ్ కారిడార్ వేగం గంటకు గరిష్ఠంగా 350 కిలోమీటర్లుగా నిర్ధారించారు.
మూడున్నార గంటల్లె హైదరాబాద్ టు ముంబాయి
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకోవచ్చు. దాంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్లో వెళ్లినా 14 గంటల సమయం పడుతున్నది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తారు. ఇది పూర్తయ్యే సమయం మరింత సమయం తీసుకున్నా... ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మరింతగా ప్రపంచ పటంలో ముందు నిలవటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సహకారం అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. దీంతో..నవంబర్ లో బిడ్లు ఓపెన్ చేసిన తరువాత ఈ ప్రాజెక్టు కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.