ఫెడరల్ ఫ్రంట్ సాద్యం కాదు..! మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదు..! సీపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు..!!
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు జరిగినా పరామర్శించకుండా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కాలయాపన చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇంటర్ పరీక్షల్లో కుంభకోణంపై 'చంద్రశేఖర్ రావు ప్రభుత్వన్నీ నిలదిస్తాం' పోస్టర్ ను నారాయణ ఆవిష్కరించారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబం వాళ్ళు 15 మంది చనిపోయారని, అలాగే ఇంటర్ పరీక్షల వ్యవహారంలో మరో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడ్డారని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రశేఖర్ రావుకు చీమ కుట్టినట్టు కూడా లేదని నారాయణ విమర్శించారు.
మోది, కేసీఆర్ లను విమర్శించిన నారాయణ..! ఇద్దరూ అవకాశ వాదులేనన్న సీపిఐ కార్యదర్శి..!!
విద్యార్థుల మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతున్నా కనీసం వాళ్లకు చంద్రశేఖర్ రావు సంఘీభావం తెలపరా అని నారాయణ ప్రశ్నించారు. ఇంతటి నియంత సీఎంను దేశంలో ఎక్కడా లేడన్నారు. నిరంతరం శవాల తెలంగాణ కావాలనే తెలంగాణ కోరుకున్నారా??. సీఎం చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని శవాల తెలంగాణ గా పేరు మార్చారని, విద్యార్థుల మరణాల పట్ల మానవ హక్కుల సంఘాన్ని కలుస్తామని, రాష్ట్ర పతి దృష్టికి వెళ్తామని స్పష్టం చేసారు నారాయణ.
కేసీఆర్ తో కాని పని..! థర్డ్ ఫ్రంటో ముందుకు సాగదని చెప్పిన నారాయణ..!!
తమిళనాడు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న స్టాలిన్ ని చంద్రశేఖర్ రావు కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటో నని, త్వరలో కేంద్రంలో రాబోయే ప్రభుత్వం కోసం టీమ్ ను తయారు చేసుకొనే పనిలో చంద్రశేఖర్ రావు బిజీగా ఉన్నాడని ఎద్దేవా చేసారు. ఇక ప్రధాని మోదీ నిరంతరం ఒక మేకప్ కిట్ తయారు చేసుకొని అదే మేకప్ లో ఉంటున్నాడని, విదేశీ పర్యటనల్లో ఉన్న యావ దేశ సమస్యలపై లేవని మండిపడ్డారు. నోట్లు రద్దు చేసి ఒక్క రూపాయి పట్టుకోలేదని, వేల కోట్ల బ్లాక్ మనీ వైట్ మనీ గా మార్చేందుకు ఇదో స్కీం పెట్టాడని మోదీ పై దుమ్మెత్తిపోసారు నారాయణ.
హోల్ సేల్ అవినీతికోసం మోదీ ప్రయత్నం..! సైన్యాన్ని రాజకీయాలకు వాడుకున్నాడని విమర్శలు..!!
హోల్ సెల్ అవినీతి కోసం, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసం నోట్ల రద్దు తెరపైకి తెచ్చారని, సైన్యం చేసే పనుల్లో ప్రధాని జోక్యం చేసుకుంటారని, భారత రాజకీయలకు సైన్యానికి సంబంధం లేదని నారాయణ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల కోసం సైన్యాన్ని వాడుకోవాలని చూసిన ప్రధాని మోడీ తప్ప ఎవరూ లేరని ఘాటు విమర్శలు చేసారు. సీబీఐ, ఆర్బీఐ, ఈసీ మోదీ ప్రైవేట్ సైన్యంలా మారాయని, బీజేపీ గెలిచే ప్రాభవం ఉన్న ప్రాంతాల్లో సైన్యాన్ని పంపే కుయుక్తులకు మోదీ తెర లేపాడని ఆరోపించారు.
కేసీఆర్ ఏ ఎండకాగొడుగు..! రాజకీయ చమత్కారంటూ విమర్శలు..!!
దేశంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అత్యంత తెలివికల్లోడు చంద్రశేఖర్ రావు ఒక్కడే నని, రేపు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది అంటే వారి వెంట వెళ్లేందుకు కూడా చంద్రశేఖర్ రావు వెనకాడరని చెప్పుకొచ్చారు. తనకు ఎలా అనుకూలం అనుకుంటే అలా మాట్లాడగల చతురత చంద్రశేఖర్ రావు సొంతమని అన్నారు. వాస్తవ పరిస్థితుల నుండి ప్రజల ద్రుష్టిని మరల్చే గొప్ప శక్తి చంద్రశేఖర్ రావు కు ఉందని చమత్కరించారు నారాయణ.