కనివిని ఎరగని.. గాంధీలో వింత కేసు.. వృషణాల్లేవు, పిల్లలెలా పుట్టారు?
సాధారణంగా స్త్రీల్లో ఉండే.. గర్భసంచి, అండాలు వంటి అవయవాలు అతనిలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఓ వింత కేసును డీల్ చేస్తున్నారు. 30ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లల తండ్రిలో.. స్త్రీత్వపు లక్షణాలు కనిపించడంతో.. అసలు అతను మగవాడేనా? అన్న విషయాన్ని నిర్దారించేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మోత్కూర్ కు చెందిన సదరు వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా కడుపు నొప్పి తీవ్రంగా వేధిస్తుండడంతో.. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. దీంతో సర్జరీ నిమిత్తం గత నెల 23న అతన్ని ఆస్పత్రిలో చేర్చుకున్నారు వైద్యులు. శుక్రవారం నాడు అతనికి సర్జరీ నిర్వహించగా.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
సాధారణంగా స్త్రీల్లో ఉండే.. గర్భసంచి, అండాలు వంటి అవయవాలు అతనిలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. విషయాన్ని వెంటనే ఆండ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ జగదీష్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వాటిని స్త్రీల్లో ఉండే గర్భసంచి, అండాలుగా ప్రాథమిక నిర్ధారణ చేశారు. సాధారణంగా మహిళల్లో ఉండే అన్ని రకాల హార్మోన్లు అతనిలో ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే అతని వృషణాల సంచిలో వృషణాలు లేవని.. ఆ సంచి ఖాళీగా ఉందని వైద్యులు చెప్పడం గమనార్హం.
మరైతే పిల్లలెలా పుట్టారు?
వృషణాల సంచిలో ఉండాల్సిన వృషణాలు లేకపోయినప్పటికీ.. పురుషుల్లో ఉండాల్సిన అన్ని లక్షణాలు, హార్మోన్లు అతనిలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. అందువల్లే అతనికి ఇద్దరు పిల్లలు పుట్టినట్లు పేర్కొన్నారు. స్త్రీ హార్మోన్లు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని శారీరక, వైద్యపరమైన కారణాల వల్ల అతనిలో స్త్రీత్వం పరిణితి చెందలేకపోయిందని వెల్లడించారు.
ప్రస్తుతం అతను స్త్రీనా? మగవాడా? అన్న అంశాన్ని లోతుగా స్టడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్యులు. ఇందుకోసం అతని కడుపు నుంచి సేకరించిన గర్భసంచిలోని కొంత భాగాన్ని వైద్య పరీక్షలకు పంపించారు. ఈ టెస్టులకు సంబంధించిన నివేదిక అందితే అతని విషయంలో ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.