అవార్డులు వెనక్కి ఓ నాటకం: ఇస్రో మాజీ చీఫ్, నేను వెనక్కివ్వను: విద్యాబాలన్
హైదరాబాద్/ముంబై: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేయటం ఓ నాటకమని ప్రముఖ శాస్త్రవేత్, ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ గురువారం అన్నారు. ఆయన హైదరాబాదులో మాట్లాడారు.
భారత్ వంటి పెద్ద దేశాల్లో ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయన్నారు. దానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని బాధ్యురాల్ని చేయడం ఏమాత్రం సరికాదన్నారు. చాలావరకు పురస్కారాలను ఆయా వ్యక్తుల జీవనకాల సాఫల్యతకు గుర్తింపుగా ఇస్తుంటారన్నారు.
తిరిగి ఇవ్వడం ద్వారా చిన్నబుచ్చుకోవడం తగదన్నారు. పురస్కారాలను వాపసు వెనుక రాజకీయ కోణాలను కొట్టిపారేయలేమని చెప్పారు. శాస్త్రవేత్తలు, రచయితలు నిర్మాణాత్మకంగా స్పందించాలే గాని ఇలాంటివి సరికాదని వ్యాఖ్యానించారు.
తాను తన పురస్కారాన్ని వాపసు చేయనని ప్రముఖ నటి విద్యాబాలన్ వేరుగా చెప్పారు. ఉత్తమ నటిగా తనకు లభించిన జాతీయ పురస్కారాన్ని దేశం ఇచ్చిందే గానీ, ఒక ప్రభుత్వం ఇచ్చింది కాదని చెప్పారు. అందువల్ల దానిని తాను వాపస్ ఇవ్వనని ప్రకటించారు.
కాగా, సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇవ్వడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారు బిజెపి వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులుగా కమలం పార్టీ చెబుతోంది.
అంతేకాదు, ఇప్పుడు అవార్డులు వెనక్కి ఇస్తున్న వారు గోద్రా అల్లర్లు, సిక్కుల ఊచకోత, కాశ్మీర్ పండిట్ల ఊచకోత సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మోడీ ప్రధాని కావడం జీర్ణించుకోలేక విపక్షాల సానుభూతిపరులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.