పట్టాలు తప్పిన బీఎంసీ: పలు రైళ్లు రద్దు, రాకపోకలకు తీవ్ర అంతరాయం
మహబూబ్నగర్: మన్నెంకొండ రైల్వేస్టేషన్ దగ్గర బుధవారం సాయంత్రం ట్రాక్పై బీసీఎమ్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక క్రేన్ తీసుకొచ్చి పట్టాలు తప్పిన బీసీఎమ్ యంత్రాన్ని పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
బీసీఎం పట్టాలు తప్పిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ-చెన్నై చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ను వాడి స్టేషన్ మీదుగా దారి మళ్లించారు. నాగర్ కోయిల్-బెంగళూరు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
కాచిగూడ-కర్నూలు టౌన్ ప్యాసింజర్ బాలానగర్ స్టేషన్ వరకు రాగా తిరిగి కాచిగూడ పంపించివేశారు. కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ మహబూబ్ నగర్ స్టేషన్కు చేరుకోగా ప్రయాణికులను అక్కడే దింపేసి ఆ రైలును కూడా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది.
వాగులోకి ఆర్టీసీ బస్సు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే, పెద్దగా అనుభవంలేని కొందరు డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రఘుపతిపేట సమీపంలోని దుందుభి వాగులోకి దూసుకెళ్లింది.
తెల్కపల్లి నుంచి కల్వకుర్తికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాజ్ వే దాటుతున్న సమయంలో రహదారి సరిగా కనిపించకపోవడంతో బస్సు చక్రాలు ఇసుకలోకి కూరుకుపోవడంతో బస్సు వాగులోకి వెళ్లింది. అయితే, వాగులో పెద్దగా నీటి ఉధృతి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని 25మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.