నేరేడుచర్లలో తీవ్ర ఘర్షణ..ఎక్స్ అఫీషియో సభ్యుడిపై అభ్యంతరం..చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా
తెలంగాణా రాష్ట్రంలో మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ వివిధ చోట్ల ఘర్షణలకు కారణం అవుతుంది . నెరేడుచర్ల మున్సిపాలిటీలో నేడు చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం నెలకొంది. ఇక నేరేడుచర్లలో టీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ తన పంతాన్ని నెగ్గించుకుంది. బలం నిరూపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో గందరగోళ పరిస్థితుల నడుమ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
నేరేడుచర్లలో చైర్మన్ ఎన్నిక హై డ్రామా
నేరేడుచర్లలో మొత్తం 15 వార్డులున్నాయి. టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు.
నెరేడుచర్ల మున్సిపాలిటీలో ఓటు వేసిన కేవీపీ రామచందర్ రావు
రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్ నెరేడుచర్ల మున్సిపాలిటీలో ఓటు వేయడానికి వీల్లేదని రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు . అయితే ఆ ఆదేశాలను సస్పెండ్ చేసి కేవీపీ ఓటు వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అవకాశం కల్పించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా తమ పార్టీ నుండే ఎన్నిక కావాలని చేసిన ఎత్తులను చిత్తు చేయడంతో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు సమాన ఓట్లు .. ఘర్షణ
ఇక నేడు ఎన్నిక సందర్భంగా ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకునేందుకు కేవీపీ రామచంద్రరావు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళటంతో బలాబలాల సంఖ్య కాంగ్రెస్ కి 10 అయ్యింది. ఇక టీఆర్ఎస్ బలం కూడా 10కి చేరుకోవడంతో ఇరువురి బలం సమానమైంది. అయితే కేవీపీ రామచంద్రరావును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా లోపలికి అనుమతి ఇవ్వటంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
మైక్ విరగ్గొట్టి, పేపర్లు చించేసిన సైదిరెడ్డి .. ఎన్నిక రేపటికి వాయిదా
ఎమ్మెల్యే సైదిరెడ్డి మైక్ను విరగ్గొట్టి, పేపర్లు చింపివేశారు. దీంతో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్ఎస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గందరగోళం నేపథ్యంలో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మరి రేపు నేరేడు చర్ల చైర్మన్ ఎన్నిక విషయంలో ఏం జరగనుందో వేచి చూడాలి .