నిజాం కాలేజీలో రచ్చ: విదేశీ-స్థానిక విద్యార్థుల 'ఫైట్', ఎందుకు?
ఆగ్రహించిన స్థానిక విద్యార్థి స్వదేశీ విద్యార్థిపై తిరగబడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త తీవ్ర ఘర్షణగా మారడంతో.. ఇరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.
బషీర్బాగ్: చారిత్రక నిజాం కాలేజీలో విదేశీ విద్యార్థులకు, స్థానిక విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. చిన్న విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారడంతో కాలేజీలో పెద్ద దుమారమే రేగింది. చివరాఖరికి ఇరు వర్గాలు కొట్టుకునేదాక వెళ్లింది. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లగా.. విద్యార్థులు మీడియాను అడ్డుకున్నారు.
కామర్స్ విభాగానికి చెందిన విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో.. ఎగ్జామ్ హాల్ లో యమన్ దేశానికి చెందిన ఓ విదేశీ విద్యార్థి స్థానిక విద్యార్థిని సమాధాన పత్రం చూపించాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో.. విషయాన్ని మనసులో పెట్టుకున్న యమన్ విద్యార్థి.. పరీక్ష అనంతరం అతన్ని వెనుక నుంచి వచ్చి కాలుతో తన్నాడు.
ఆగ్రహించిన స్థానిక విద్యార్థి స్వదేశీ విద్యార్థిపై తిరగబడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త తీవ్ర ఘర్షణగా మారడంతో.. ఇరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. స్థానిక విద్యార్థి విదేశీ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాడు.
ఇంతలోనే విదేశీ విద్యార్థిని ఎవరో రాయితో కొట్టడంతో తలకు గాయమైంది. ఘటనను కొంతమంది విద్యార్థులు సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా.. వాటిని లాక్కుని నేలకేసి కొట్టారు. విషయం తెలసుకున్న మీడియా, ఘర్షణను చిత్రీకరిస్తుండగా.. వద్దని హెచ్చరించారు.
అనంతరం అబిడ్స్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. గాయపడ్డ విదేశీ విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. స్థానిక విద్యార్థులు అప్పటికే వెళ్లిపోయారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.