రేవంత్ X తుమ్మల: చంద్రబాబు ప్రస్తావనతో సభలో నవ్వులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంతరెడ్డి, రాష్ట్ర రోడ్డు-భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై రేవంతరెడ్డి మాట్లాడారు.
వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత-కాళేశ్వరం వంటి కొత్త ప్రాజెక్టులకు బదులు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మహబూబ్నగర్లో నిర్మాణంలో ఉన్న ఐదు ప్రాజెక్టులు పూర్తవుతాయని రేవంత్రెడ్డి అన్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ప్రాధాన్యం వివరించాలని కోరారు.
దీంతో తుమ్మల లేచి మాట్లాడుతూ గోదావరి, కృష్ణానదులపై ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటిని మొదలు పెడతామని అన్నారు. అదే విధంగా గతంలోనే నివృత్తి చేసిన సందేహాలను మళ్లీ ప్రస్తావించడం సరికాదని అన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు నిధులిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ర్టానికి నష్టం జరగని విధంగా రేవంతరెడ్డి ప్రసంగించాలంటూ చురకలంటించారు. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఇప్పుడూ మంత్రులుగా ఉన్నారని, అప్పటి టీడీపీ హయాంలో తెలంగాణకు మేలు జరిగిందని చెబితే బాగుండేదని పేర్కొన్నారు.
దీనికి బదులుగా తుమ్మల స్పందిస్తూ... 'జూరాల, ఎస్ఎల్బీసీ రెండోదశ, తెలంగాణకు నీళ్లు తెచ్చినప్పుడు ఆ సభ్యుడు (రేవంత్) లేడు. నిన్నగాక మొన్నొచ్చి తెలంగాణ.. టీడీపీ అంటున్నడు. అప్పుడు ఉంటే తెలిసేది' అని తుమ్మల అన్నారు.
'కే బినెట్ మొత్తం టీడీపీనే కదా. మాదగ్గర ట్రైనింగ్ పొందిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. మీతో పాటు నర్సన్న (నాయిని), లక్ష్మన్న (లక్ష్మారెడ్డి) కూడా టీడీపీ నుంచి పోయినోళ్లే' అని రేవంత్ అనడంతో దీంతో 'ఆ పార్టీ అధ్యక్షుడు(బాబు) కూడా మా వద్ద ట్రైనింగ్ పొందారు' అని తుమ్మల జవాబివ్వడంతో సభలో నవ్వులు పూశాయి.