కోర్టులో అనిల్తో సారిక గొడవ: మర్నాడు అర్థరాత్రి అనంతలోకాలకు..
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆయన మనవళ్ల దహనం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారి మృతికి కొన్ని గంటల ముందు రాజయ్య కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం విషయంలో గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ఆ రోజు ఇంట్లో రాజయ్య, మాధవి, అనిల్, సారికలతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - మంగళవారం రాత్రి వరంగల్ ఉప ఎన్నికల్లో ఖర్చుల కోసం రఘునాథపల్లి మండలంలోని వ్యవసాయ భూమిని అమ్మాలని రాజయ్య అనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే తన, తన పిల్లల భవిష్యత్తు ఏ విధమైన హామీ ఇవ్వకుండా భూమిని అమ్మడం సరి కాదని సారిక చెప్పినట్లు సమాచారం.
రెవెన్యూ కాలనీలో ఉన్న ఇంటిని ఇస్తామని, వ్యవసాయ భూమి విషయంలో కల్పించుకోవద్దని రాజయ్య సారికకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత కుటుంబ సభ్యులు సారికకు ఎదురు తిరిగి ఏమీ ఇచ్చేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఆ రోజు అర్థరాత్రి వరకు గొడవ జరిగినట్లు చెబుతున్నారు. వారి గొడవ బయటకు కూడా వినిపించినట్లు చెబుతున్నారు. గొడవ సద్దుమణిగిన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
కాగా, భర్త అనిల్ నుంచి జీవనభృతి ఇప్పించాలని గృహహింస చట్టం కిదం నిరుడు జూన్లో వరంగల్ నాలుగో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో సారిక కేసు దాఖలు చేశారు. జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6 వేలు, ఆమె ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పన మొత్తం రూ.15 వేలు భరణం చెల్లించాలని ఈ ఏడాది జనవరిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, జీవనభృతి చెల్లించకపోవడంతో సారిక మరోసారి జులైలో కోర్టుకు మెట్లు ఎక్కారు. దీంతో ఏడు నెలలకు కలిపి అనిల్ రూ.1.05 లక్షలు బకాయికి గాను రూ.45 వేలు చెల్లించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 2వ తేదీన సారిక, అనిల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇది జరిగిన మరుసటి రోజు అర్థరాత్రి సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు.