తెలంగాణా రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్: దేశంలోనే తొలిసారి, కేటీఆర్ ట్వీట్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా చాలా రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత నెలకొంది . తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కొరత నెలకొనే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమై యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ను తెప్పిస్తోంది. పరిస్థితి చెయ్యి దాటక ముందే జాగ్రత్తపడుతుంది.
దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాలు
దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణరాష్ట్రం యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు ఈ ఉదయం బయలుదేరి వెళ్లాయి. ఎనిమిది ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను హైదరాబాద్ కు ఈ యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
బేగం పేట ఎయిర్ పోర్ట్ నుండి యుద్ధ విమానాల్లో ఎనిమిది ట్యాంకర్లను పంపిన టీ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడం కోసం ప్రభుత్వం చేపట్టిన తక్షణ చర్యలలో భాగంగా రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరాను సైనిక విమానాల ద్వారా చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , సి ఎస్ సోమేష్ కుమార్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించి ఆక్సిజన్ ను తీసుకురావడానికి ఎనిమిది ట్యాంకర్లను పంపించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యల్లో భాగంగా యుద్ధ విమానాలను పంపించి ఆక్సిజన్ తీసుకురావాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ట్వీట్ , ప్రజల ప్రాణాలను కాపాడే ప్రక్రియగా పేర్కొన్న కేటీఆర్
ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తుందని, సత్వరమే ఆక్సిజన్ ను రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకుందని, మూడు రోజుల సమయం వృధా కాకుండా చూడడంతో పాటుగా, ఎంతో మంది బాధితుల విలువైన ప్రాణాలను కాపాడడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత .. ముందే మేల్కొన్న తెలంగాణా
ఒకపక్క దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా , మధ్య ప్రదేశ్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి . ఢిల్లీలో చాలా ఆస్పత్రులలో ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ నేపధ్యంలో అలాంటి దారుణ పరిస్థితులు రాక ముందే తెలంగాణా సర్కార్ మేల్కొంది. యుద్ధ విమానాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ తెప్పిస్తుంది .