లోకాయుక్త అవినీతి కేసు: భాస్కర్ రావ్ మీద చార్జ్ షీట్
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (ఎస్ఐటీ) లోకాయుక్త మాజీ న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ మీద చార్జ్ షీటు నమోదు చేశారు. లోకాయుక్త అవినీతి కేసులో భాస్కర్ రావ్ 7వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ అధికారులు భాస్కర్ రావ్ మీద 560 పేజీలకు పైగా చార్జ్ షీట్ తయారు చేశారు. ఇప్పటికే భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ (హైదరాబాద్), కర్ణాటక లోకాయుక్త మాజీ పీఆర్ఓ సయ్యద్ రియాజ్ తదితరులను గత సంవత్సరం అరెస్టు చేశారు.
అరెస్టు అయిన అశ్విన్ రావ్, సయ్యద్ రియాజ్ తదితరులను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని వీరి మీద ఆరోపణలు వచ్చాయి.
ఇదే సమయంలో పలువురు అధికారులు సైతం ఫిర్యాదులు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన అశ్విన్ రావ్ తన తండ్రి లోకాయుక్త న్యాయమూర్తిగా భాద్యతలు తీసుకున్నతరువాత బెంగళూరు చేరుకుని పలువురితో కలిసి ఈ దందా చేశాడని ఆరోపణలు ఉన్నాయి.