చిరంజీవితో మాట్లాడా, సినీ దిగ్దజాలతో మాట్లాడుతా: కెసిఆర్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై సినీ దిగ్గజాలతో మాట్లాడుతానని, ఇంతకు ముందు చిరంజీవి, మోహన్ బాబు తదితరులతో మాట్లాడానని, మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, మోహన్ బాబు, విజయనిర్మల వంటివారిని, చిరంజీవిని ఆహ్వానిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ఇంకా ఏవరైనా ఉంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయం చేస్తారని, ఒక రోజు కాకపోతే రెండు రోజులు సమావేశమై సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో జయసుధ కుమారుడు నటించిన బస్తీ సినిమా ఆడియో విడదుల వేడకకు ఆయన ఆదివారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్తీ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. బస్తీ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమా హీరో శ్రేయన్ తెలుగు అమితాబ్ బచ్చన్లా ఉన్నాడని అభినందించారు.
అత్యధికంగా సినిమా షూటింగ్లు జరుగుతోంది హైదరాబాద్లోనేనని, కరెంటు సమస్యను అధిగమించి దేశ విదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే స్థితిలో ఉన్నామని, సినీ దిగ్గజాలతో చర్చించి సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టూ స్టూడియోలు నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, ఏ దేశంలో కవులు, కళాకారులు గౌరవించబడతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని, సినిమా రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్లోనే సినిమా శిక్షణ కేంద్రం నెలకొల్పుతామని అన్నారు. ఇతర రాష్ర్టాల వారు మన దగ్గరకు శిక్షణ కోసం వచ్చేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. భాషకు, కళకు, సంగీతానికి అవధులు ఉండవవని, కళారంగ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసరి నారాయణ రావు, మోహన్బాబు, మురళీ మోహన్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, డి.సురేష్బాబు, విజయనిర్మల, ఎన్.శంకర్, జీవితా రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ను మోహన్ బాబు ప్రశంసించారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవుతారనేది చేపడుతున్న కార్యక్రమాలను చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు.