దాసరి మృతి: వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు, షాక్కు గురయ్యానని చంద్రబాబు
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతి చెందిన విషయం తెలిసి ప్రముఖ నటుడు మోహన్ బాబు కన్నీరుమున్నీరయ్యారు.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతి చెందిన విషయం తెలిసి ప్రముఖ నటుడు మోహన్ బాబు కన్నీరుమున్నీరయ్యారు. దాసరి మృతి విషయం తెలియగానే ఆయన ఆసుపత్రికి తరలి వచ్చారు.
తరలి వస్తున్న పెద్దలు
దాసరి హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తను తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కిమ్స్ ఆసుపత్రి వద్దకు సినీ పరిశ్రమ పెద్దలు అక్కడికి తరలివస్తున్నారు.
వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు
విషయం తెలుసుకున్న నటుడు మోహన్ బాబు అక్కడికి హుటాహుటిన వచ్చారు. దాసరి మృతిపట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. వెక్కి వెక్కి ఏడ్చారు. దాసరిని మోహన్ బాబు గురువుగా సంభోదిస్తారు.
జన్మనిచ్చారని..
మోహన్ బాబు మాట్లాడుతుూ.. 'ఒక చరిత్ర ముగిసిపోయింది.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆయన సేవలు మర్చిపోలేనివి.. నాకు నటుడిగా జన్మనిచ్చారు...' అంటూ ఏదో చెప్పబోతూనే ఉద్వేగంతో కన్నీరు పెట్టుకొని మాట్లాడలేకపోయారు.
అభిమానులు రావొద్దని..
ప్రస్తుతం ఆసుపత్రిలో దాసరి భౌతికకాయం వద్ద మోహన్బాబుతో పాటు పలువురు ఉన్నారు. అభిమానులెవ్వరూ ఆసుపత్రి వద్దకు రావద్దని దాసరి సన్నిహితులు సూచిస్తున్నారు.
చంద్రబాబు, కేసీఆర్ల సంతాపం
దాసరి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు సంతాపం తెలిపారు. తెలుగు సినిమాను దాసరి జాతీయస్థాయికి తీసుకు వెళ్లారని చంద్రబాబు అన్నారు. సినిమా పరిశ్రమకు పెద్దదిక్కు అన్నారు.
షాక్కు గురయ్యానన్న చంద్రబాబు
దాసరి నారాయణ రావు మృతి చెందారన్న వార్త తనను షాక్కు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. ఆయన మరణించారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ వార్త నాకు షాక్లాంటిందని, ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో ఆయన తనతో ఎంతో బాగా మాట్లాడారని అన్నారు.
నన్ను కుటుంబ సభ్యుడిగా చూసేవారు
తన పెళ్లికి ముందు నుంచి దాసరి తనకు తెలుసునని, దాసరి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. ఎంతో మంది నటులను పరిచయం చేశారని, ఎన్నో సినిమాలను ఎన్టీఆర్తో చేశారని, తెలుగు సినిమాకి ఎనలేని సేవలందించారన్నారు. ఎంతో కష్టపడే మనస్తత్వం ఆయనది అన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని, దాసరి, పద్మ తనను ఓ కుటుంబ సభ్యుడిగా చూసేవారని, దాసరికి పట్టుదల ఎంతో ఎక్కువ అని, అటువంటి వ్యక్తి చనిపోవడం ఎంతో బాధగా ఉందని, ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ సహా పలువురి సంతాపం
దాసరి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాపు నేత ముద్రగడ పద్మనాభం, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్, తెలుగు రాష్ట్రాల మంత్రులు, నాయకులు సంతాపం తెలిపారు.