దుబ్బాక బైపోల్ : బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు... ఫైనల్ లిస్ట్ ఇదే...
తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో నిలిచారు. ఇందులో 8 మంది ఆయా పార్టీ గుర్తులపై పోటీ చేస్తుండగా... 15 మంది స్వతంత్రులు ఉన్నారు. నిజానికి మొత్తం 46 నామినేషన్లు దాఖలవగా చివరి నిమిషంలో 11 మంది ఉపసంహరించుకున్నారు. మరో 12 నామినేషన్లు పరిశీలన దశలో తిరస్కరణకు గురయ్యాయి.
పార్టీ గుర్తులపై పోటీ చేస్తున్నవారిలో టీఆర్ఎస్ తరుపున సోలిపేట సుజాత,కాంగ్రెస్ పార్టీ- చెరుకు శ్రీనివాస్రెడ్డి,బీజేపీ తరుపున రఘు నందన్ రావు,అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరుపున కత్తి కార్తీక,జై స్వరాజ్ తరుపున గౌట్ మల్లేశం, శ్రమజీవిపార్టీ తరుపున జాజుల భాస్కర్, ఇండియా ప్రజా బంద్ పార్టీ తరుపున సునీల్,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున సుకురి అశోక్ బరిలో నిలిచారు.
ఇండిపెండెంట్ అభ్యర్థులుగా అండర్ఫ్ సుదర్శన్,అన్న బుర్ర రవి తేజ గౌడ్,అన్న రాజ్,కంటే సాయన్న,కొట్టాల యాదగిరి ముదిరాజ్, కోట శ్యామ్ కుమార్,విక్రమ్ రెడ్డి వేముల,బండారు నాగరాజ్,పీఎం బాబు,బుట్టన్నగారి మాధవ రెడ్డి,మోతె నరేష్,రణవేని లక్ష్మణ్ రావు,రేపల్లె శ్రీనివాస్,వడ్ల మాధవాచారి,సిల్వెరి శ్రీకాంత్ ఉపఎన్నిక బరిలో నిలిచారు.
Recommended Video
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3 వ తేదీన ఉపఎన్నిక జరగనుండగా... నవంబర్ 10న పోలింగ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఉపఎన్నికలో గెలిచి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు,టీఆర్ఎస్ దూకుడుకు ఎలాగైనా బ్రేక్ వేసి.. ప్రభుత్వంపై వ్యతిరేకతను బయటపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ ఎన్నికలో గెలవడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అటు ఇతర పార్టీల నేతలు,ఇండిపెండెంట్లు కలిపి 20 మంది బరిలో నిలవడంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా తెలంగాణలో రసవత్తరంగా మారిన దుబ్బాక ఉపఎన్నికలో అంతిమ విజయం ఎవరిదో తేలాలంటే వచ్చే నెల పదో తేదీ వరకు ఆగాల్సిందే.