విత్తనాల కల్తీపై పోరాడి గెలిచిన రైతన్న .. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం
హైదరాబాద్ : ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర రాకుంటే ఆ రైతుకు అరణ్య రోదనే. దుక్కి దున్ని పంట వేసినప్పటి నుంచి తన రక్తాన్ని ధారపోసి శ్రమిస్తాడు. విత్తనాల మొదలుకొని, ఎరువులు, గడ్డిమందు .. ఇతర రసాయనాలను కొని పంటను కంటికి రెప్పాలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర రాకుంటే సాధారణ రైతు అయితే ఖర్మ అని ఊరుకుంటాడు. కానీ ఎల్లయ్య అనే రైతు అలా చేయలేదు. వినియోగదారుల కేంద్రాన్ని ఆశ్రయించి విజయం సాధించాడు. తాను నష్టపోయాయని .. కోర్టు మెట్లెక్కి కంపెనీ నుంచి ముక్కుపిండి మరీ పరిహారం వసూల్ చేశాడు.
రెండెకరాల పొలంలో టమాట సాగు
సిద్దిపేట జిల్లాలోని బుస్సాపూర్ గ్రామనికి చెందిన రైతు గువ్వ ఎల్లయ్యకు రెండెకరాల పొలం ఉంది. దేశీ టమాట కిలో రూ.30 పలుకుతుందని తన పొలంలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2011 ఆగస్టులో సిద్దిపేట ఉద్యానశాఖ సబ్సిడీలో ఇస్తున్న విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 11 విత్తన ప్యాకెట్లు తీసుకెళ్లి చల్లాడు. విత్తనాల కోసం రూ.2 లక్షలు వెచ్చించాడు. మొక్కలు ఏపుగా పెరిగాయనే సంతోషం కొద్దిరోజుల్లోనే ఆవిరైపోయింది. తాను తీసుకొచ్చిన టమాట హైబ్రీడ్ వని తెలిసి మదనపడ్డాడు. ఇక చేసేదేమీ లేక మార్కెట్ కు తీసుకెళ్లాడు. అయితే అప్పుడు దేశీ టమాటా కిలో రూ.30 ఉంటే .. బెంగళూరు టమాటా రూ.7 మాత్రమే ఉన్నది. దీంతో కంపెనీపై న్యాయపోరాటినికి సిద్దమయ్యాడు.
కోర్టును ఆశ్రయించిన ఎల్లయ్య
2012లో మెదక్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు ఎల్లయ్య. పంట కోసం పెట్టిన రూ. రెండు లక్షలపెట్టుబడి కూడా రాలేదని విత్తన కంపెనీపై కేసు పెట్టాడు. సగటున 90 టన్నుల దిగుబడి వచ్చేదని .. టన్ను రూ.22 వేల చొప్పున 19.80 లక్షల పరిహారం ఇప్పించాలని అధికారులతోపాటు, కంపెనీపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అప్పటి జిల్లా ఫోరం ప్రెసిడెంట్ .. పంటనష్టంపై నివేదిక ఇవ్వాలని స్థానిక హార్టికల్చర్ విభాగం అధికారులను ఆదేశించారు. పంటను పరిశీలించిన అధికారులు .. విత్తనాలు మారి రైతుకు నష్టం జరిగినట్టు తమ రిపోర్టులో పేర్కొన్నారు. దాని పరిశీలించిన ఫోరం ప్రెసిడెంట్ .. ఎల్లయ్యకు జరిగిన నష్టానికి సదరు కంపెనీ రూ. 2 లక్షల 60 వేల 500 ఇవ్వాలని .. దీంతోపాటు అదనంగా 60 వేల పరిహారం చెల్లించాలని 2013 డిసెంబర్ 27న తీర్పునిచ్చారు. అలాగే రైతును మానసికంగా బాధపెట్టినందుకు మరో రూ.5 వేలు చెల్లించాలని స్పష్టంచేశారు.
అప్పీల్ చేసిన కంపెనీ .. రైతుదే విజయం
జిల్లా వినియోగదారుల తీర్పును సవాల్ చేస్తు రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కంపెనీ ఆశ్రయించింది. ఇక్కడ కూడా ఎల్లయ్యనే విజయం వరించింది. జిల్లా ఫోరం తీర్పును రాష్ట్ర వినియోగదారుల ఫోరం సమర్థించింది. అలాగే రూ.లక్షన్నర చెక్కును రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో డిపాజిట్ చేసింది. చివరగా జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిష్కారాల కమిషన్ కు అప్పీల్ చేసింది. ఎన్సీడీఆర్సీ బెంచ్ కూడా జిల్లా, రాష్ట్ర ఫోరంల తీర్పులనే సమర్థించింది. పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
2.10 లక్షల చెక్కు అందజేత
ఇదివరకు విశాల్ సీడ్స్ కంపెనీ డిపాజిట్ చేసిన రూ.లక్షన్నరకు వచ్చిన వడ్డీతో కలిపి రూ.2 లక్షల 10 వేల 831ను ఎల్లయ్యకు బుధవారం అందజేశారు. మిగతా పరిహారం కోసం త్వరలోనే జిల్లా ఫోరం తీసుకుంటానని ఎల్లయ్య తెలిపారు.
ఎనిమిదేళ్లుగా పోరాటం ..
తాను పంట నష్టపోయానని ఎల్లయ్య ఊరుకోలేదు. జిల్లా వినియోగదారుల ఫోరంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే కంపెనీ రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే వారికి అక్కడ కూడా చుక్కెదురు కావడంతో .. చేసేదేమీ లేక ఎల్లయ్యకు నష్ట పరిహారాన్ని అందజేసింది.
అధికారులే వ్యతిరేక సాక్ష్యమిచ్చారు
నాసిరకం విత్తనాలతో పంట దిగుబడి రాక నష్టపోయానని ఎల్లయ్య చెప్పాడు. తనకు న్యాయం చేస్తానని చెప్పిని అధికారులే ఫోరంలో వ్యతిరేకం సాక్ష్యం ఇచ్చారని ఆరోపించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల కేంద్రాల్లో 8 ఏళ్లపాటు కేసు నడిచినా .. చివరికి తననే విజయం వరించిందన్నారు. కంపెనీ డిపాజిట్ చేసిన నగదే అందిందని .. మిగతా నగదు కోసం జిల్లా వినియోగదారుల కేంద్రాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. తన ఈ విజయం మిగతా రైతులకు ఆదర్శంగా నిలువాలన్నారు.