ఎట్టకేలకు జనార్ధన్ రెడ్డికి పోస్టింగ్ .. వన్ ఇండియా సహా మీడియా కథనాలతో స్పందించిన ప్రభుత్వం
హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ జనార్థన్ రెడ్డికి ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. జీహెఛ్ఎంసీ కమిషనర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయనను ప్రభుత్వం లూప్ లైన్ లో పెట్టింది. జనార్థన్ రెడ్డితోపాటు మరో 20 మంది అధికారులకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో వన్ ఇండియా సహా మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం లూప్ లైన్ లో ఉన్న అధికారులకు పోస్టింగులపై దృష్టిసారించింది. తొలుత జనార్థన్ రెడ్డి సహా నలుగురికి బాధ్యతలు అప్పగించింది.
ఎందుకు లేటయ్యింది ?
రాష్ట్రంలో అసలే ఐఏఎస్ ల కొరత ఉంది. ఉన్న బ్యూరోక్రాట్ల సేవలు వినియోగించుకోవడం లేదు. ట్రైనీ ఐఏఎస్ లు 10 మంది, 20 మందిని సీనియర్ బ్యూరోక్రాట్లు లూప్ లో ఉన్నారు. ఈ జాబితాను ఇటీవల వన్ ఇండియా వెబ్ సైట్ సహా .. మిగతా వార్తాసంస్థలు ప్రముఖంగా ప్రస్తావించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మొత్తం జాబితాను తీసి .. ఫస్ట్ లిస్ట్ లో కొందరికి పోస్టింగులు ఇస్తూ చర్యలు తీసుకున్నది.
విద్యాశాఖ కార్యదర్శిగా నియామకం
జీ జనార్ధన్ రెడ్డిను విద్యశాఖ కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రయారిటీ ఇస్తోంది. కేజీ టు పీజీ .. గురుకులాలు ... సహా ఇతర అంశాలు విద్యాశాఖ పరిధి కిందకే వస్తాయి. ఈ క్రమంలో జనార్థన్ రెడ్డి ఈ పదవీ ఇవ్వడం ఆయన సమర్థతకు నిదర్శమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదివరకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. బల్దియాలో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి .. ప్రభుత్వ పెద్దల మన్ననలు కూడా పొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో తప్పించడంతో .. ఇన్నాళ్లు లూప్ లైన్ లో ఉన్నారు.
కలెక్టర్లుగా ముగ్గురు జేసీలు
జనార్ధన్ రెడ్డితోపాటు మరో ముగ్గురు జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా మస్రత్ ఖానమ్ అయేషా, ములుగు కలెక్టర్ గా సీ నారాయణ రెడ్డి, నారాయణపేట కలెక్టర్ గా ఎస్ వెంకటరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులు జారీచేశారు.