క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది. ఇటీవల క్యాబినెట్ కూర్పులో 10 మందికి అవకాశం కల్పించిన కేసీఆర్ .. గిరిజనులు, మహిళలకు చోటు ఇవ్వలేదు. దీంతో శనివారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి కోరగా .. అందుకు సానుకూలంగా స్పందించారు.
ఇద్దరికీ అవకాశం
రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఓ మహిళగా కోరుతున్నానని సబితా ఇంద్రారెడ్డి బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ .. త్వరలోనే మహిళలకు అవకాశం కల్పిస్తానని స్పష్టంచేశారు. ఇద్దరికీ చోటు ఇస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారాయన. అలాగే సీఎం కోటా ఎమ్మెల్సీ సీట్లలో కూడా సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.
ఆరుగురిలో ఇద్దరు .. మరి నలుగురు ఎవరు ?
రాష్ట్రంలో సీఎంతోపాటు 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఇటీవల 10 మందితో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు కేసీఆర్. సీఎంతోపాటు మహమూద్ అలీ ప్రమాణం చేశారు. ఇంకా ఆరుగురి మంత్రివర్గంలో అవకాశం ఉంది. అందులో ఇద్దరూ మహిళలంటే ఎవరా మహిళలనే చర్చ జరుగుతోంది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తోన్నాయి. వీరితోపాటు పార్టీ మారిన నేతలకు కూడా పదవీ ఇస్తామని కేసీఆర్ హామీనిచ్చిన్నట్టు తెలుస్తోంది. మహిళల కేటాయింపుల సంగతి తేలితే .. మిగతా నలుగురు నేతలు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే తనకు అత్యంత విశ్వాసంగా ఉన్న వారికి, సామాజిక సమీకరణాల ఆధారంగా బాధ్యతలు అప్పగించారు. మరి ఆ నలుగురు ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.
మహిళ సంఘాల వడ్డీలేని రుణం రూ.10 లక్షలు
మహిళ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. రంగారెడ్డి జిల్లాలో నెలకొల్పిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను మహిళా సంఘాలకే అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు వారికి ఇచ్చే వడ్డీలేని రుణాన్ని రూ. 10 లక్షలకు పెంచుతున్నట్టు స్పష్టంచేశారు. ఆ నగదు మీద వడ్డీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు.
ఇచ్చేది రూ.50 వేలు .. వచ్చేది రూ.24 వేలు
రాష్ట్రం కేంద్రానికి కట్టే పన్నులు రూ.50 వేల కోట్లయితే .. మనకు వచ్చేది కేవలం రూ.24 వేల కోట్లేనని స్పష్టంచేశారు. కిసాన్ సన్మాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు చెక్కులు అందజేస్తామని స్పష్టంచేశారు. అలాగే రుణమాఫీ చెక్కులను రైతులకు నేరుగా అందజేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారాయన. ఇదివరకు చేసిన రుణమాఫీ సమయంలో బ్యాంకర్లు ఇబ్బందికి గురిచేశారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తానని స్పష్టంచేశారు.