ఎట్టకేలకు పార్టీ మార్పు..! బీజేపీ లో చేరనున్న మోత్కుపల్లి...?!!
హైదరామాద్ : టీడిపి మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎట్టకేలకు ఓ రాజకీయ పార్టీ అండ చూసుకున్నారు. టీడిపి నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి ఏ పార్టీ లో చేరకుండా రెండేళ్లు గడిపారు. చివరకు బీజేపిలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ విసిరిన ఆకర్ష్ వలలో మరికొందరు నాయకులు కూడా పడిపోతున్నారు. ఏపీలో టీడీపీని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించేందుకు, తన బలగాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ తాజా, టీడీపీ మాజీ నాయకులకు గాలం వేస్తోంది. తెలంగాణలోని బలమైన సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇప్పటికే లైన్ లో పెట్టింది. ఉమ్మడి వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులతో, నాయకులతో మంతనాలు సాగిస్తోంది. వీరితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ టచ్ లో ఉన్నారు.
Recommended Video
ఆకర్ష్ వ్యూహాన్ని ముమ్మరం చేయాలంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారట. దీంతో, లక్ష్మణ్ కూడా వేగం పెంచారట. మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్ మాజీ ఎంపీ బలరాం నాయక్, టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడా సురేష్రెడ్డి, బోడ జనార్ధన్, మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులతో లక్ష్మణ్, రాంమాధవ్ తదితర బీజేపీ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. మున్మందు ఈ జాబితా ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే టీడీపీ అదృశ్యమైంది. కాంగ్రెస్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రెండు పార్టీలకు సమీప కాలంలో భవిష్యత్తు లేదనుకున్న నాయకులు... ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకుంటున్నారు. బీజేపీ కోరుకుంటున్నది కూడా ఇదే. చేరికకు ముహూర్తం ఎప్పుడో చూడాలి.